Tobacco and Pan masala prices: కేంద్ర ప్రభుత్వం (Central Govt) పొగాకు మరియు సంబంధిత ఉత్పత్తులపై పన్నుల విధానాన్ని మరింత కఠినతరం చేసింది. పాన్ మసాలా(Pan masala), సిగరెట్లు (cigarettes), బీడీలు(Bedis), ఇతర పొగాకు ఉత్పత్తుల(Tobacco products)పై అదనపు ఎక్సైజ్ సుంకం, అలాగే పాన్ మసాలాపై ప్రత్యేక సెస్ విధించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తాజా నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఈ కొత్త పన్ను విధానం ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుంది. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు జాతీయ భద్రతకు అవసరమైన నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ప్రస్తుతం పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు మరియు వాటితో సంబంధం ఉన్న ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 40 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. బీడీలపై 18 శాతం జీఎస్టీ అమలులో ఉంది. తాజా నిర్ణయంతో ఈ జీఎస్టీకి అదనంగా పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ పెంపు చేయడంతో పాటు, పొగాకు ఉత్పత్తులపై ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నారు. ఈ మొత్తం పన్ను భారంతో ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాన్ మసాలా తయారీపై ఆరోగ్య మరియు జాతీయ భద్రత సెస్ విధించడం, అలాగే పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం వసూలు చేయడం కోసం కేంద్రం గత డిసెంబర్లో రెండు కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.
ఈ బిల్లులకు లోక్సభ, రాజ్యసభ రెండూ ఆమోదం తెలిపాయి. ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు–2025’ ఆమోదం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాన్ మసాలాపై ఇప్పటికే 40 శాతం జీఎస్టీ అమలులో ఉందని, దానికి అదనంగా సెస్ వసూలు చేస్తామని ఆమె తెలిపారు. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని సెస్ మొత్తాన్ని నిర్ణయిస్తామని, ఈ విధంగా సమకూరే నిధులను ప్రజారోగ్య కార్యక్రమాలు మరియు జాతీయ భద్రత బలోపేతానికి వినియోగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ నిర్ణయాల ప్రభావం స్టాక్ మార్కెట్పై కూడా వెంటనే కనిపించింది.
కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ అనంతరం సిగరెట్ తయారీ సంస్థల షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగనుండటంతో వినియోగం తగ్గవచ్చన్న అంచనాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో ఐటీసీ షేరు ధర 52 వారాల కనిష్ఠానికి పడిపోగా, గాడ్ఫ్రే ఫిలిప్స్ షేరు దాదాపు 10 శాతం మేర క్షీణించింది. కేంద్రం తీసుకున్న ఈ పన్ను విధాన నిర్ణయం ఒకవైపు ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తుండగా, మరోవైపు పరిశ్రమలు మరియు మార్కెట్లపై తక్షణ ప్రభావం చూపుతోంది. ఫిబ్రవరి 1 తర్వాత ఈ చర్యలు వినియోగదారుల ప్రవర్తన, పరిశ్రమల అమ్మకాలు, ప్రభుత్వ ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది చూడాల్సి ఉంది.
