Sricharani: వన్డే మహిళా ప్రపంచకప్లో తన ప్రతిభతో దేశం మొత్తాన్ని గర్వపడేలా తెలుగు క్రికెటర్ శ్రీచరణి (Cricketer Sricharani)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆమె ప్రదర్శనకు గుర్తింపుగా ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించడమే కాకుండా, గ్రూప్–1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం మరియు కడప జిల్లాలో ఇంటి స్థలాన్ని కూడా అందజేయాలని నిర్ణయించింది. ఈ ప్రకటనతో క్రీడాభిమానులు, ముఖ్యంగా మహిళా క్రికెట్ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఉదయం శ్రీచరణి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్లను అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఆ సందర్భంగా సీఎం ఆమెను అభినందిస్తూ తెలుగు యువతకు శ్రీచరణి ఆదర్శం. కష్టపడి సాధించిన ఈ విజయంతో రాష్ట్రం గర్వపడుతోంది. మహిళల క్రీడా రంగానికి ఇది కొత్త శక్తిని ఇస్తుంది అని పేర్కొన్నారు.
తరువాత మీడియాతో మాట్లాడిన శ్రీచరణి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరి అభిమానం, ప్రోత్సాహం నాకు ఎంతో ప్రేరణనిస్తోంది. చిన్నప్పటి నుంచి నా కుటుంబం నన్ను బలంగా నిలబెట్టింది. మా మామ గారు నన్ను క్రికెట్ ఆడమని ప్రోత్సహించేవారు. నేను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కింద శిక్షణ పొందాను. ఇప్పుడు ప్రపంచకప్లో ఆడిన అనుభవం నాకు ఒక కొత్త ఆరంభం లాంటిది. ఇది మొదటి అడుగు మాత్రమే.. ముందు ఇంకా చాలా దూరం ఉంది అని ఆమె అన్నారు. అలాగే, భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇటీవల కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ శ్రీచరణి తెలిపారు. ప్రధాని గారు నన్ను ప్రోత్సహిస్తూ, భవిష్యత్ కార్యాచరణపై విలువైన సూచనలు ఇచ్చారు. మరింత కష్టపడి దేశానికి ఇంకా గొప్ప విజయాలు తీసుకురావాలని సూచించారు అని చెప్పారు.
శ్రీచరణి సాధించిన ఈ విజయంతో తెలుగు రాష్ట్రాల్లో మహిళా క్రికెట్పై కొత్త చైతన్యం మొదలైంది. పల్లె స్థాయిలో ఉన్న ప్రతిభావంతులైన యువతులు కూడా ఇప్పుడు తమ కలలను నిజం చేసుకోవచ్చని విశ్వాసం కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారం క్రీడారంగానికి ప్రోత్సాహకరంగా మారుతుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీచరణికి ఇచ్చిన ఈ గౌరవం, మహిళా క్రీడాకారిణులకు కొత్త దారులను తెరవబోతుందనే నమ్మకం క్రీడాభిమానులలో కనిపిస్తోంది. వన్డే ప్రపంచకప్లో మెరిసిన ఈ తెలుగు తేజం విజయగాధ ఇంకా ఎన్నో యువత హృదయాలను స్ఫూర్తినిస్తుంది.
The Government of Andhra Pradesh, led by Hon’ble Chief Minister Shri N. Chandrababu Naidu Garu has announced a cash award of ₹2.5 crore, a 1,000 sq. yard house site, and a Group-I government job for Ms. Shree Charani in recognition of her exemplary performance in the ICC Women’s… pic.twitter.com/lUHpx1fHy9
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 7, 2025
