AP Government: సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసు సిబ్బంది, కాంట్రాక్టర్లకు పెద్ద ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్స్, వివిధ శాఖల బిల్లులు, బకాయిల క్లియరెన్స్ కోసం మొత్తం రూ.2,653 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో లక్షలాది మందికి నేరుగా లాభం చేకూరనుంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో అత్యధిక భాగాన్ని ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ, డీఆర్ ఎరియర్స్ చెల్లింపులకు కేటాయించింది. పెండింగ్లో ఉన్న ఒక ఇన్స్టాల్మెంట్ను క్లియర్ చేయడానికి రూ.1,100 కోట్లను విడుదల చేసింది.
దీని ద్వారా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కింద ఉన్న సుమారు 2.25 లక్షల మంది ఉద్యోగులు దాదాపు 2.70 లక్షల మంది పెన్షనర్లు నేరుగా ప్రయోజనం పొందనున్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఎరియర్స్ అందడంతో ఉద్యోగ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పోలీసు సిబ్బందికి కూడా ఈసారి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. సరెండర్ లీవుల బకాయిల చెల్లింపుల కోసం రూ.110 కోట్లను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 55 వేల మంది పోలీసులకు ఆర్థిక లబ్ధి కలగనుంది. పండుగ వేళ ఈ నిధులు అందడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూడా ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారింది. ఈఏపీ, నాబార్డు, సాస్కీ, సీఆర్ఐఎఫ్ వంటి వివిధ ప్రాజెక్టుల కింద చేసిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల కోసం రూ.1,243 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
ఇందులో ‘నీరు-చెట్టు’ పథకం బకాయిలకు సుమారు రూ.40 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 19 వేలకుపైగా కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించబడనున్నాయి. ఈ ఆర్థిక ప్యాకేజీ ద్వారా సుమారు 5.70 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లు సంక్రాంతి పండుగ వేళ ప్రత్యక్ష లాభం పొందనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పండుగకు ముందు ఆర్థిక చైతన్యం తీసుకువచ్చిందని, ప్రజలపై భారం తగ్గించే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
