Polavaram : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రతిష్ఠాత్మక పోలవరం సాగునీటి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులతో విస్తృతంగా సమీక్ష(Review) నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తిపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మరోసారి సీఎం స్పష్టం చేశారు. పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ సర్వే నిర్వహించారు. ప్రాజెక్టు పరిసరాలు, నదీ ప్రవాహం, జరుగుతున్న పనుల స్థితిగతులను పై నుంచి పరిశీలించారు. అనంతరం కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2 పనుల పురోగతిపై అధికారులను వివరంగా ప్రశ్నించారు.
ప్రస్తుతం ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అధికారుల నుంచి నివేదికలు కోరారు. కాఫర్ డ్యామ్ పనులు నిర్దేశించిన గడువులో పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వరదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక ఉండాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అలాగే, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ల పనుల్లో ఆలస్యం జరగకుండా మానిటరింగ్ పెంచాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, త్రాగునీటి సమస్యలు తీరుతాయని అన్నారు. ప్రాజెక్టు వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలోని రైతులకు స్థిరమైన భరోసా కలుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రాజెక్టు ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాలకు సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. పోలవరం పనుల్లో పారదర్శకత, నాణ్యత, వేగం కీలకమని సీఎం మరోసారి గుర్తుచేశారు. అవసరమైన నిధులు, వనరులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నిరంతర పర్యవేక్షణతో ప్రాజెక్టును నిర్ణీత కాలంలో పూర్తి చేయడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
