end
=
Friday, February 27, 2026
వార్తలుజాతీయంఉత్తరాదిని గజగజలాడిస్తున్న చలిపులి: ఐఎండీ హెచ్చరికలు
- Advertisment -

ఉత్తరాదిని గజగజలాడిస్తున్న చలిపులి: ఐఎండీ హెచ్చరికలు

- Advertisment -
- Advertisment -

Delhi : ఉత్తర భారతదేశాన్ని చలిపులి తీవ్రంగా వణికిస్తోంది. శీతాకాలం (winter) మరింత ఉగ్రరూపం దాల్చడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఈ సీజన్‌లోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ఠంగా 3 డిగ్రీల సెల్సియస్ మాత్రమే నమోదు కావడంతో నగరవాసులు గజగజలాడిపోయారు. సాధారణం కంటే దాదాపు 4.4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత ఉండటం గమనార్హం. ఉదయం వేళ గాలిలో తేమ శాతం 100కి చేరడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఇదే సమయంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. తీవ్రమైన చలిగాలులు దట్టమైన పొగమంచు కొనసాగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అత్యున్నత హెచ్చరిక అయిన ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది.

ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. పంజాబ్‌లోని భటిండాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 0.6 డిగ్రీలకు పడిపోగా అమృత్‌సర్, ఫరీద్‌కోట్ ప్రాంతాల్లో 1 డిగ్రీ మాత్రమే నమోదైంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు చేరగా, నగర శివార్లలో మైనస్ 0.9 డిగ్రీల వరకు నమోదైంది. రాజస్థాన్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. సికార్ జిల్లాలోని ఫతేపూర్ శేఖావతి ప్రాంతంలో ఏకంగా మైనస్ 1.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదై చలితీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. తీవ్ర చలి, పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. రహదారులపై కనిపించేంత దూరం తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో నేలపై మంచు పొర ఏర్పడటంతో ఉదయాన్నే జనజీవనం నిలిచిపోయింది.

ఈ ప్రభావం వ్యవసాయ రంగానికీ తాకింది. మంచు కారణంగా ఆవాలు, టమాటా, మిరప వంటి పంటలు దెబ్బతింటాయనే భయంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర హర్యానాపై ఏర్పడిన పశ్చిమ విక్షోభం, ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ చలిగాలులు కొనసాగుతున్నాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాబోయే రెండు రోజులు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం కొనసాగుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే జనవరి 17 వరకు యెల్లో అలర్ట్ కొనసాగుతుందని స్పష్టం చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -