Delhi: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు(Dense fog) పూర్తిగా కమ్మేసింది. అతి సమీపంలో ఉన్న వాహనాలు(Vehicles) కూడా కనిపించని స్థాయికి విజిబిలిటీ(Visibility) పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి రెడ్ అలర్ట్ (Red alert)జారీ చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి వాతావరణం అకస్మాత్తుగా మరింత కఠినంగా మారిందని, రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఈ పొగమంచు ప్రభావంలో చిక్కుకున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కప్పేసినట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తక్కువ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు వారు వివరించారు. ఇదిలా ఉండగా, వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన కఠిన చర్యలు అమల్లోకి వచ్చాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత సూచీ (AQI) 403గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వెల్లడించింది. ఇది ‘తీవ్రంగా ప్రమాదకరమైన’ స్థాయిగా పరిగణిస్తారు. వివేక్ విహార్ (460), ఆనంద్ విహార్ (459), రోహిణి (445), వజీర్పూర్ (444) ప్రాంతాలు అత్యధికంగా ప్రభావితమైనవిగా గుర్తించారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో కాలుష్య స్థాయులు తీవ్రమైన జోన్లోకి ప్రవేశించడంతో నియంత్రణ చర్యలను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోవడంతో రైలు, విమాన సర్వీసుల్లో జాప్యాలు చోటుచేసుకున్నాయి.
రాజధాని ఎక్స్ప్రెస్, వందేభారత్, జన శతాబ్ది సహా పలు కీలక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల కోసం ప్రత్యేక అడ్వైజరీని జారీ చేసింది. విమానాల రద్దు లేదా ప్రయాణ సమయాల్లో మార్పులపై ముందుగానే సమాచారం తెలుసుకోవాలని విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. ఇందుకోసం ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్లు, హెల్ప్లైన్లను పరిశీలించాలని కోరాయి. ప్రయాణికుల సౌకర్యార్థం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా అన్ని విమానయాన సంస్థల కస్టమర్ సపోర్ట్ ఫోన్ నంబర్లను విడుదల చేసింది. పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రజలు అవసరం లేకుండా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
