Russia: యుద్ధాన్ని ముగించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin) నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు (Drone attacks)జరిగాయన్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ దాడులకు ఉక్రెయిన్ దళాలే(Ukrainian forces) కారణమని రష్యా మొదటి నుంచే ఆరోపిస్తోంది. అయితే ఉక్రెయిన్తో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఈ ఆరోపణలను ఖండించడంతో, తమ వాదనకు బలమైన ఆధారాలు చూపించాలనే ప్రయత్నంలో రష్యా కీలక అడుగు వేసింది. ఈ క్రమంలోనే దాడికి సంబంధించిన ఆధారాలను అమెరికాకు అందజేసినట్లు మాస్కో ప్రకటించింది. రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో డ్రోన్ దాడికి సంబంధించిన సాంకేతిక వివరాలు, శకలాలపై విశ్లేషణ ఉందని పేర్కొంది.
రష్యా సైనిక నిఘా సంస్థ అధిపతి అడ్మిరల్ ఇగోర్ కోస్ట్యుకోవ్ మాస్కోలో యూఎస్ మిలిటరీ అటాచ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన కీలక వివరాలను అమెరికా ప్రతినిధులకు వివరించినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. కోస్ట్యుకోవ్ తెలిపిన వివరాల ప్రకారం, దాడిలో ఉపయోగించిన మానవరహిత విమానాల (డ్రోన్లు) శకలాలను రష్యా భద్రతా బలగాలు గుర్తించాయి. కూల్చివేసిన అనేక డ్రోన్లలో నేవిగేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినకుండా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ పరికరాలను రష్యాకు చెందిన ప్రత్యేక నిపుణులు సాంకేతికంగా పరీక్షించగా, డ్రోన్ల గమ్యం నోవ్గొరొడ్ ప్రాంతంలో ఉన్న అధ్యక్షుడు పుతిన్ నివాసమేనని నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలతో సంబంధమైన అన్ని వివరాలు, డేటాను అమెరికాకు అప్పగించినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ మాత్రం ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా ఖండిస్తోంది. నాటో దేశాలు కూడా రష్యా ఆరోపణలకు మద్దతుగా నిలవలేదు. మరోవైపు, కీవ్ ఈ తరహా దాడికి యత్నించిందన్న విషయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవని యూఎస్ ఇంటెలిజెన్స్ సంస్థలు పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో డ్రోన్ దాడి అంశంపై రష్యా అమెరికాకు ఆధారాలు సమర్పించడం గ్లోబల్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతోంది. యుద్ధం ముగింపుపై చర్చలు సాగుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు, ప్రతిఆరోపణలు అంతర్జాతీయ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
