end
Friday, April 10, 2026
వార్తలురాష్ట్రీయంమేడారం మహాజాతరకు కేసీఆర్‌కు ప్రభుత్వ ఆహ్వానం
- Advertisment -

మేడారం మహాజాతరకు కేసీఆర్‌కు ప్రభుత్వ ఆహ్వానం

- Advertisment -
- Advertisment -

Warangal : తెలంగాణ రాష్ట్ర పండుగగా (Telangana state festival) గుర్తింపు పొందిన మేడారం మహాజాతరను (Medaram Mahajatara)రాజకీయాలకు అతీతంగా, సమైక్యతతో నిర్వహించాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు (KCRర్) ను అధికారికంగా ఈ మహాజాతరకు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆహ్వానాన్ని వ్యక్తిగతంగా అందజేయడానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Sitakka) ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. మేడారం జాతరకు కేసీఆర్‌కు ఉన్న అనుబంధం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ వనదేవతల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారీ నిధులు కేటాయించడమే కాకుండా, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు.

ఆ నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పటికీ, ఆయనను గౌరవంతో ఆహ్వానించాలన్న ప్రభుత్వ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మేడారం జాతరను ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యక్రమంగా కాకుండా, ప్రజల విశ్వాసం, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ ఆలోచనలో భాగంగా ఆమె నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలను అందజేశారు. మేడారం జాతర కేవలం ఉత్సవం మాత్రమే కాదని, కోట్లాది మంది భక్తుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక వేడుక అని ఆమె పేర్కొన్నారు. రాజకీయ భేదాలను పక్కన పెట్టి ప్రజాప్రతినిధులందరూ అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని ఆమె కోరారు.

ఈ ఏడాది మేడారం మహాజాతర ఈ నెల 28వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వనదేవతల పండుగకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రవాణా, తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి ఏర్పాట్లను వేగవంతం చేసింది. ప్రతిపక్ష నేతలను సైతం ఆహ్వానించడం ద్వారా జాతరను మరింత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ కేసీఆర్ ఈ ఆహ్వానాన్ని స్వీకరించి మేడారం జాతరకు హాజరైతే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం–బీఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నడుమ ఇది ఒక కీలక రాజకీయ పరిణామంగా మారే అవకాశం ఉంది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -