Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉరి తీయాలంటూ మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకే లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమ నాయకుడిపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అనుచితమని అన్నారు.
శుక్రవారం శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తన రాజీనామా ఆమోదం కోరేందుకే శాసనమండలికి వచ్చానని తెలిపారు. కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు విన్నప్పుడు తన రక్తం మరిగిపోయిందని, అలా అయితే రేవంత్ రెడ్డిని ఒక్కసారి కాదు రెండు సార్లు ఉరేయాలన్నట్టుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ను కసబ్తో పోల్చడం తీవ్ర తప్పిదమని, ఓ ఉద్యమ నాయకుడిపై మాట్లాడే ముందు ముఖ్యమంత్రి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హితవు పలికారు.
అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాల అంశంపై కేసీఆర్ మాట్లాడితేనే అధికార పక్షం నోరు మూయాల్సి వస్తుందని కవిత వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్లో “బబుల్ షూటర్లు” మాత్రమే డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఉన్నారని విమర్శించారు. పార్టీ మనుగడ కొనసాగాలంటే కేసీఆర్ తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలని సూచించారు. నదీ జలాల వంటి కీలక అంశాలను అనుభవం లేని వారిపై వదిలేయవద్దని హెచ్చరించారు.
రాష్ట్ర ఆర్థిక శాఖలో ఒక్క ఫైల్ తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉందని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత ఆరోపించారు. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు శాశ్వతంగా తెలంగాణ నీళ్లను తరలించేందుకు ఏకతాటిపై ఉన్నారని, అయితే తెలంగాణలో ఆ స్థాయి ఐక్యత కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మాటల విషయంలో సంయమనం పాటించాలని, రాజకీయ విమర్శలు హద్దులు దాటకూడదని కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
