Delhi: నూతన సంవత్సర వేడుకలు(New Year celebrations) శాంతియుతంగా జరగాలనే లక్ష్యంతో ఢిల్లీ పోలీసులు(Delhi Police) విస్తృత స్థాయిలో భద్రతా చర్యలు(Security measures) చేపట్టారు. ఇందులో భాగంగా ఆగ్నేయ దిల్లీలో ‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’ పేరుతో అర్ధరాత్రి వేళ భారీ తనిఖీలు నిర్వహించారు. వీధి రౌడీలు, సంఘటిత నేరాల నేపథ్యం ఉన్న వ్యక్తులు, అనుమానాస్పద కార్యకలాపాల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ప్రత్యేక ఆపరేషన్ను అమలు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఆపరేషన్లో భాగంగా పెద్దఎత్తున మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 40కి పైగా ఆయుధాలను పోలీసులు పట్టుకున్నారు. వీటిలో దేశీయంగా తయారుచేసిన 21 పిస్టల్స్, 20 తూటాలు, 27 కత్తులు ఉన్నాయి.
నేర కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదం ఉన్న ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా భద్రతాపరంగా పెద్ద విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల సమయంలో పోలీసులు మొత్తం 285 మందిని అరెస్టు చేశారు. అదేవిధంగా మరో 504 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి భారీగా డ్రగ్స్, అక్రమ మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి దాదాపు రూ.2 లక్షల నగదు పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నగదు నేర కార్యకలాపాలకు సంబంధించినదిగా అనుమానిస్తున్నారు.
అంతేకాకుండా, ఈ ఆపరేషన్లో భాగంగా 310 మొబైల్ ఫోన్లు, 231 ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ దొంగిలించిన వస్తువులుగా ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిపారు. సంబంధిత యజమానులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. కొత్త సంవత్సర వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఈ ఆపరేషన్ను చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని తెలిపారు. నేరస్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
