Hydrogen Train: భారత రైల్వే రంగం(Indian Railway Sector)లో మరో చారిత్రక మైలురాయికి మోదీ ప్రభుత్వం (Modi Govt)బాటలు వేసింది. పర్యావరణ హిత రవాణా దిశగా కీలక అడుగు వేస్తూ, దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు(Hydrogen Train)ను పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవం హర్యానాలో జరగనుండగా, రైల్వే శాఖ ఇప్పటికే అన్ని సాంకేతిక పరీక్షలు, మౌలిక వసతుల ఏర్పాట్లను పూర్తిచేసింది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ హైడ్రోజన్ రైలు, హర్యానాలోని జింద్ – సోనీపత్ మార్గంలో ప్రయాణికులకు సేవలందించనుంది. సంప్రదాయ డీజిల్ రైళ్లతో పోలిస్తే ఈ రైలు పూర్తిగా కాలుష్య రహితంగా పనిచేయడం విశేషం.
హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ రైలు ప్రయాణ సమయంలో కార్బన్ ఉద్గారాలను విడుదల చేయదు. దీంతో గ్రీన్ ఎనర్జీ వినియోగంలో భారత్ మరో ముందడుగు వేసినట్టయింది. ఈ రైలుకు అవసరమైన ఇంధనం కోసం జింద్లో ప్రత్యేక హైడ్రోజన్ ప్లాంట్ను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ మరియు సరఫరా వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేశారు. ఇది భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్ రైళ్లకు మార్గం సుగమం చేసే కీలక మౌలిక వసతిగా భావిస్తున్నారు. రాబోయే గణతంత్ర దినోత్సవం, అంటే జనవరి 26న ఈ హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ ప్రారంభం కానుంది.
ఈ పరీక్షా ప్రయాణం దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గంటకు సుమారు 150 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఈ రైలుకు ఉంది. ఆధునిక భద్రతా ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభూతిని అందించనుంది. ఈ ట్రయల్ రన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన హాజరైతే, హైడ్రోజన్ ఆధారిత రవాణాపై దేశం తీసుకుంటున్న దీర్ఘకాలిక దృష్టికి ఇది మరింత బలం చేకూర్చనుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన స్వావలంబన లక్ష్యంగా భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ హైడ్రోజన్ రైలు ఒక కీలక మైలురాయిగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
