ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ఈసారి మాట నిలబెట్టుకునేలా ఉన్నాడు. సాధారణంగా రాజమౌళి సినిమాలంటే చెప్పిన తేదీకి రావని, కనీసం ఒకటి రెండు సంవత్సరాలు ఆలస్యం అవుతుంటాయని అందరూ అనుకుంటారు. కానీ వారణాసి విషయంలో మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకునేలానే కనబడుతున్నాడని లేటెస్ట్ అప్టేడ్స్ చూస్తే అర్థం అవుతుంది.
‘ఆర్ఆర్ఆర్’తో (RRR) ఇంటర్నేషనల్ ఆడియన్స్ను మెప్పించడం ద్వారా తన కొత్త చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెట్టుకునేలా చేశాడు రాజమౌళి. ఎన్నడూ లేని విధంగా ఇండియన్ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖులు కూడా ఎదురు చూడడం వారణాసి(Varanasi) చిత్రానికే జరుగుతోంది. టైటిల్ టీజర్ తో త్రేతాయుగానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు ముడిపెడుతూ వెండితెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు తేలిపోయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు.
ఈ భారీ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కుంభా అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆయన ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు సినిమా విడుదలకు సరిగ్గా ఏడాది సమయం ఉండగానే పృథ్వీరాజ్ పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తి అయ్యిందట. ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీరాజే ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించాడు.
తన పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని వెల్లడించి, ఇక తాను చీట్ మీల్ తినడానికి సమయం ఆసన్నమైందంటూ ఈ చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ ఏర్పాటు చేసిన విందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. దీంతో ‘వారణాసి’ రిలీజ్ డేట్ కు వచ్చేలా స్పీడ్ ట్రాక్లో షూటింగ్ జరుగుతోందని చెప్పడానికి ఇండికేషన్ గా భావిస్తున్నారు.
‘వారణాసి’ భారీగా విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ చిత్రం. ఈ పాటికే వీఎఫెక్స్ పని మొదలు కాగా.. సినిమా విడుదలకు కనీసం ఆరు నెలల ముందు షూట్ మొత్తం పూర్తి చేసి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. అందుకే ఈ ఏడాది ఆగస్టుకల్లా షూట్ పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు.
