North Korea : ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) కుమార్తె కిమ్-జు-యే(Kim-Ju-ye) మరోసారి బహిరంగంగా కనిపించడంతో అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశ మాజీ నేతల స్మారకంగా ఉన్న ‘కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్’(Kumsusan Palace of the Sun)ను కిమ్ కుటుంబం సందర్శించింది. ఈ కార్యక్రమానికి కిమ్ జోంగ్ ఉన్తో పాటు ఆయన భార్య రి సోల్ జు, కుమార్తె కిమ్-జు-యే మరియు పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జు-యే తండ్రి, తల్లితో కలిసి కనిపించడం మరోసారి వారసత్వ అంశాన్ని తెరపైకి తెచ్చింది. గత మూడేళ్లుగా కిమ్ జోంగ్ ఉన్తో పాటు కిమ్-జు-యే అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఆమెను కీలక కార్యక్రమాలకు తీసుకువెళ్తుండటాన్ని గమనిస్తున్న దక్షిణ కొరియా నిఘా వర్గాలు, భవిష్యత్తులో ఉత్తరకొరియా అధికార పగ్గాలు ఆమెకే అప్పగించాలనే సంకేతాలుగా భావిస్తున్నాయి.
ఈ అంశంపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం కూడా ఉందని సమాచారం. కిమ్ జు-యే మొదటిసారిగా 2022లో ప్రపంచానికి పరిచయమైంది. ఆ తర్వాత 2023లో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన వేడుకల్లో ఆమె కనిపించింది. అప్పటి నుంచి క్షిపణి ప్రయోగాల పరిశీలన, జాతీయ వేడుకలు, స్మారక కార్యక్రమాలు వంటి పలు సందర్భాల్లో తండ్రి పక్కనే ఉండటం విశేషంగా మారింది. ఈ పరిణామాలన్నీ ఆమె కిమ్ కుటుంబ రాజకీయ వారసురాలనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. గత ఏడాది కిమ్ జోంగ్ ఉన్ చైనాకు అధికారిక పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా కిమ్-జు-యే ఆయనతో కలిసి వెళ్లడం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.
సాధారణంగా అత్యంత రహస్యంగా వ్యవహరించే ఉత్తరకొరియా పాలక వ్యవస్థలో ఒక చిన్నారి ఇలా బహిరంగంగా కనిపించడం అరుదైన విషయంగా విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ కొరియా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో రెండో సంతానంగా పుట్టిన కిమ్-జు-యేనే భవిష్యత్తులో అధికారం చేపట్టే అవకాశం ఎక్కువగా ఉందని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. కిమ్ స్వయంగా కూడా వంశపారంపర్య పాలన ద్వారానే అధికారంలోకి వచ్చారు. ఆయన తండ్రి కిమ్ జోంగ్-ఇల్ 2011లో మరణించిన తర్వాత దేశాధ్యక్ష బాధ్యతలను కిమ్ జోంగ్ ఉన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో, కిమ్-జు-యే తరచూ బహిరంగంగా కనిపించడం ఉత్తరకొరియా రాజకీయ భవిష్యత్తుపై కొత్త సంకేతాలను ఇస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
