Kondagattu : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan)శనివారం ఉదయం హెలికాప్టర్ ద్వారా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు(Kondagattu)కు చేరుకున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో స్థానిక పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ప్రాంగణం పరిసరాల్లో సీసీటీవీ నిఘా, అదనపు బందోబస్తుతో పరిస్థితిని పర్యవేక్షించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తొలిసారి కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్కు జనసేన అధినేత హోదాలో ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఆలయంలో అంజన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కల్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రత్యేక చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కేటాయించిన రూ.35.19 కోట్ల నిధులతో కొండగట్టులో నిర్మించనున్న ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 96 గదులతో ఆధునిక వసతులు కలిగిన ధర్మశాలను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కలగనుందని పేర్కొన్నారు.
భూమి పూజ అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “అభివృద్ధి పనులు ప్రారంభించాలంటే దేవుడి దయ అవసరం. కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చిన స్థలం. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను బయటపడటం ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆ సమయంలో కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు” అని భావోద్వేగంగా తెలిపారు. దీక్ష విరమణకు ప్రత్యేక మండపం, భక్తుల కోసం సత్రం అవసరమని గతంలో తనను పలువురు కోరినట్లు చెప్పారు. టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, అధికారుల సమష్టి కృషితో ఈ పనులు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తో పాటు ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నాచుపల్లి శివారులోని ఓ రిసార్ట్లో జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. అక్కడ పార్టీ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. పర్యటన ముగిసిన తర్వాత మధ్యాహ్నం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారని అధికారులు వెల్లడించారు.
కొండగట్టు చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు pic.twitter.com/hlJhGubKC0
— Kalyan_follower (@wasimjsp_) January 3, 2026
