end
=
Sunday, February 8, 2026
వార్తలుఅంతర్జాతీయంనేడు మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ..ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం
- Advertisment -

నేడు మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ..ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం

- Advertisment -
- Advertisment -

Foreign Trips : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఈ రోజు మూడు దేశాల కీలక విదేశీ పర్యటనకు(Foreign Trips )శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో ఆయన జోర్డాన్, ఇథియోపియా, ఒమన్(Jordan, Ethiopia, Oman) దేశాలను సందర్శించి అక్కడి అగ్ర నాయకులతో భేటీ కానున్నారు. భారతదేశానికి ఈ మూడు దేశాలతో ఉన్న రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముందుగా జోర్డాన్‌కు చేరుకోనున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. భారత్–జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారం, వాణిజ్య సంబంధాలు, రక్షణ రంగం, అలాగే మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి, భద్రత అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. భారతదేశానికి జోర్డాన్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారనుంది. జోర్డాన్ పర్యటన అనంతరం మంగళవారం ప్రధాని మోదీ ఇథియోపియాకు వెళ్లనున్నారు. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ ఇథియోపియాకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఉన్న సాంప్రదాయ స్నేహబంధాలను మరింత విస్తరించే అంశాలపై చర్చ జరగనుంది. వాణిజ్యం, అభివృద్ధి సహకారం, విద్య, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకునే అవకాశాలపై నేతలు దృష్టి సారించనున్నారు.

చివరిగా ప్రధాని మోదీ డిసెంబర్ 17, 18 తేదీలలో ఒమన్‌ను సందర్శించనున్నారు. ఒమన్ సుల్తాన్ హైదర్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. భారత్–ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, సముద్ర భద్రత వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడం, భవిష్యత్తు సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడమే ఈ పర్యటన లక్ష్యంగా ఉంది. ప్రధాని మోదీ ఒమన్‌ను సందర్శించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మొత్తంగా ఈ మూడు దేశాల పర్యటన ద్వారా భారత్ తన గ్లోబల్ దౌత్యాన్ని మరింత బలపరచాలని, అంతర్జాతీయ వేదికపై తన ప్రభావాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -