end
=
Monday, February 23, 2026
వార్తలుజాతీయంరాజధానిలో పొల్యూషన్...ఢిల్లీకి ప్రత్యామ్నాయంపై పెరుగుతున్న చర్చ!
- Advertisment -

రాజధానిలో పొల్యూషన్…ఢిల్లీకి ప్రత్యామ్నాయంపై పెరుగుతున్న చర్చ!

- Advertisment -
- Advertisment -

Delhi : దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కాలుష్యానికి(pollution) పర్యాయపదంగా మారుతోంది. ఏటేటా పెరుగుతున్న గాలి కాలుష్యం(Air pollution) ప్రజల జీవన విధానాన్నే కాదు, వారి ఆరోగ్య భద్రతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ శ్వాసకోశ సమస్యలు, గుండెజబ్బులు, కంటి ఇబ్బందులతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కాలుష్య తీవ్రత కారణంగా పాఠశాలలు మూసివేయడం, కార్యాలయాలకు వర్క్ ఫ్రమ్ హోం సూచనలు ఇవ్వడం వంటి చర్యలు సాధారణమయ్యాయి. ఆరోగ్యపరమైన నష్టాలతో పాటు ఆర్థిక భారమూ ప్రజలపై పెరుగుతోంది. వైద్య ఖర్చులు అధికమవుతున్నాయి. ఉత్పాదకత తగ్గడంతో పరిశ్రమలు, సేవారంగం నష్టపోతోంది. విమానాలు, రైళ్లు ఆలస్యమవడం, రహదారులపై దృశ్యమానత తగ్గిపోవడం వల్ల రవాణా వ్యవస్థ కూడా స్తంభిస్తున్నది.

ఈ ప్రభావం దేశ పరిపాలనా వ్యవహారాలపై కూడా పడుతోంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పనితీరు మందగించడం, అంతర్జాతీయ ప్రతినిధుల పర్యటనలు ప్రభావితమవడం వంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా పొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్‌లలో జరిగే పంట వ్యర్థాల కాల్చివేతలు నిలుస్తున్నాయి. ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్ అనంతరం రైతులు పొలాల్లో మిగిలిపోయిన అవశేషాలను కాల్చడం వల్ల భారీగా పొగ గాలిలో కలుస్తోంది. దీనికి తోడు ఢిల్లీలో లెక్కకు మించిన వాహనాలు, నిర్మాణ పనుల ధూళి, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. ఈ నేపథ్యంలో దేశానికి రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న వాదన మళ్లీ బలపడుతోంది.

ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఢిల్లీపై ఉన్న జనాభా, వాహనాల, పరిపాలనా ఒత్తిడి కొంత మేర తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని కీలక శాఖలను ప్రత్యామ్నాయ రాజధానికి తరలిస్తే పాలన మరింత సమర్థవంతంగా సాగుతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే రెండో రాజధాని ఏర్పాటు తక్షణ పరిష్కారం కాదని, కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరికొందరు సూచిస్తున్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పద్ధతులు అందించడం, ప్రజా రవాణాను ప్రోత్సహించడం, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడం వంటి చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ ఊపిరాడేలా చేయాలంటే దీర్ఘకాలిక, సమగ్ర వ్యూహమే ఏకైక మార్గమని స్పష్టమవుతోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -