14 నెలలుగా అమెరికాలోనే..
సిట్ నోటీసులు ఇచ్చినా స్పందన కరువు
పాస్పోర్ట్ రద్దు చేయించడంతో దిగి వచ్చిన వైనం..
సుప్రీం కోర్టు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో హైదరాబాద్ కు..
ఫోన్ట్యాపింగ్ కేసు(Phone taping case)లో ఏ1 నిందితుడైన ప్రభాకర్రావు(Prabhakar Rao) ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరయ్యారు. 14 నెలలుగా అమెరికాలో ఉంటున్న ఆయన తిరిగి హైదరాబాద్కు వచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబీ చీఫ్(SIB chief)గా సేవలందించిన ఆయన్నుసిట్ అధికారులు ఫోన్ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా చేర్చారు. నాడు ప్రభాకర్రావు కనుసన్నల్లోనే రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్న వంటి కొందరు
పోలీస్ అధికారులు జర్నలిస్టులు, న్యాయమూర్తులు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫోన్ ట్యాపింగ్పై ప్రత్యేక దర్యాప్తు బృందం(Special Investigation Team) (సిట్)ను నియమించింది. ఈ క్రమంలోనే ప్రభాకర్రావు విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్లారు. విచారణకు హాజరు కావాలని సిట్ అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో సిట్ అధికారులు ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయించారు. చివరకు సుప్రీం కోర్టు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేయడంతో ఆయన హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు.
ఆదివారం రాత్రి 8 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ప్రభాకర్రావు స్వస్థలం నీరుకొల్లు..
ప్రభాకర్రావు స్వస్థలం ప్రస్తుత హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకొల్లు గ్రామం. ఖమ్మం, వరంగల్ పోలీస్ కమిషనరేట్లు కాకముందు ఆయన వరంగల్ డీఐజీగా సేవలందించారు.
కీలక అంశాలు బయటకొచ్చే అవకాశం..
ఫోన్ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడైన ప్రభాకర్రావును విచారిస్తే అనేక కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని పోలీస్, అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ట్యాపింగ్ చేశారు? జర్నలిస్టులు, రాజకీయ నేతలు, న్యాయమూర్తల ఫోన్లు ట్యాప్ నిజమేనా? ఒకవేళ అదే నిజమైతే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు? అన్న కోణంలో సిట్ అధికారులు విచారిస్తారని సమాచారం.
బీఆర్ఎస్కు చిక్కులు
కాళేశ్వరం కుంగుబాటు, నిర్మాణంలో అవకతవకల ఆరోపణలపై ఇప్పటికే నాటి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు పీసీ ఘోష్ కమీషన్ నుంచి నోటీసులు అందుకున్నారు. ఈ అంశంలో ఇద్దరూ విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. సోమవారం హరీశ్రావు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 11న కేసీఆర్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఫార్ములా కేసులో ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్నారు.
ఇది ఇలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఏ1 నిందితుడు ప్రభాకర్రావు సిట్ ఎదుటకు హాజరయ్యారు. వరుస పరిణామాలతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని తెలిసింది.