end
=
Friday, February 27, 2026
వార్తలురాష్ట్రీయంవిధ్వంసం నుంచి సుపరిపాలన దిశగా రాష్ట్రం: సీఎం చంద్రబాబు
- Advertisment -

విధ్వంసం నుంచి సుపరిపాలన దిశగా రాష్ట్రం: సీఎం చంద్రబాబు

- Advertisment -
- Advertisment -

Amaravati : విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని తిరిగి సుపరిపాలన దిశగా నడిపించామని ఆ ప్రయత్నాలకు 2025 ఏడాది మంచి ఫలితాలు ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu)తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశం(Review meeting)లో ఆయన మాట్లాడారు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని క్లిష్ట పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చామని అయినా సూపర్ సిక్స్ పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా వేగవంతం చేయగలిగామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో 2026లో మరింత కష్టపడి పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని అధికారులకు పిలుపునిచ్చారు. గత ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని సీఎం వివరించారు. తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,090 కోట్లు జమ చేశాం. స్త్రీశక్తి పథకం కింద మహిళలు 3.5 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా ఇందుకోసం రూ.1,114 కోట్లు ఖర్చు చేశాం. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు అందించాం.

దీపం 2.0 కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్ల పంపిణీకి రూ.2,684 కోట్లు వెచ్చించాం. ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల సామాజిక పెన్షన్లు అందించి సంక్షేమంలో కొత్త మైలురాయిని నెలకొల్పాం అని తెలిపారు. ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును రాబోయే పుష్కరాల్లోగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. పోలవరం పూర్తైతే దక్షిణ భారతదేశంలో రాష్ట్రానికి పోటీ ఉండదన్నారు. ఏటా గోదావరి నుంచి సుమారు 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తోందని, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చి శ్రీశైలంలో నీటిని ఆదా చేసి రాయలసీమకు అందిస్తున్నామని చెప్పారు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు నీరు అందించే అవకాశం ఉందని, పోలవరం మిగులు జలాలను తెలంగాణ కూడా వినియోగించుకోవచ్చని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరి జలాలను సమర్థంగా వాడుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రం పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం గర్వకారణమన్నారు. గూగుల్ సంస్థ విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని, ఎస్ఐపీబీ ద్వారా రూ.8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని తెలిపారు.

వీటితో భారీగా ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అని కేంద్ర సహకారంతో రూ.12 వేల కోట్లతో ప్లాంటును కాపాడుకున్నామని చెప్పారు. గత ఏడాది 12 శాతానికి పైగా వృద్ధి సాధించామని, ఈసారి 16 శాతం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నాలపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడితో కూడా రాజకీయం చేయడం బాధాకరమని కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేయడం, తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు పెట్టడం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. పరకామణి ఘటనలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఏడాది భూ రికార్డుల ప్రక్షాళనను పూర్తి చేసి రిజిస్ట్రేషన్లను టెక్నాలజీతో మరింత పారదర్శకంగా మారుస్తామని తెలిపారు. సవాళ్లను అధిగమిస్తూ 2026ను రాష్ట్రానికి అత్యుత్తమ సంవత్సరంగా తీర్చిదిద్దేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సీఎం కోరారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -