- మంత్రి జూపల్లిని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
తెలుగు 24, హైదరాబాద్: ఆబ్కారీ శాఖ నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని అకారణంగా దూషించిన ఆ శాఖ కమిషనర్ హరికిరణ్ పై చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. జేఏసీ ఛైర్మన్ వీ లచ్చిరెడ్డి సారథ్యంలో జేఏసీ నాయకులు సోమవారం మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. సోమిరెడ్డి గత 30 ఏళ్లుగా ఆబ్కారీ శాఖలో వివిధ స్థాయిల్లో నిజాయితీగా సేవలందించారని గుర్తుచేశారు. ఉత్తమ అధికారిగా గుర్తింపు పొంది ఎంతో మందితో ప్రశంసలు పొందన్నారు. అలాంటి అధికారి పట్ల కమిషనర్ వ్యవహరించిన తీరు తెలంగాణ ఉద్యోగులకు చాలా ఇబ్బంది కలిగించిందని చెప్పారు. ఇతర అధికారులు, సిబ్బంది పట్ల కూడా కమిషనర్ ఇదే వ్యవహరశైలితో వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. కమిషనర్ వ్యవహరించిన తీరుపై తక్షణమే కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయాలని కోరారు. కమిషనర్ను శాఖ నుంచి తప్పించడంతోనే విచారణ పారదర్శకంగా సాగుతుందన్నారు. దీనిపై మంత్రి చాలా సానుకూలంగా స్పందించినట్టు జేఏసీ ఛైర్మన్ వీ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో కో ఛైర్మన్ కె.రామకృష్ణ, నాయకులు హన్మంతరావు, పెంటయ్య, కృష్ణచైతన్య, తెలంగాణ ఎక్సైస్ డిపార్టుమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జాటోతు హరికృష్ణ, నాయకులు ఏ.శ్రీనివాస్రెడ్డి, జీ.శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
