end
Tuesday, March 31, 2026
రాజకీయంతెలంగాణ అసెంబ్లీ.. కేసీఆర్‌ వద్దకు వెళ్లి పలకరించిన రేవంత్‌ రెడ్డి
- Advertisment -

తెలంగాణ అసెంబ్లీ.. కేసీఆర్‌ వద్దకు వెళ్లి పలకరించిన రేవంత్‌ రెడ్డి

- Advertisment -
- Advertisment -

Telangana Assembly: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు(Winter meetings) సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. సభా కార్యకలాపాల ప్రారంభంలోనే ఈ తీర్మానాలపై సభ్యులు మౌనం పాటించి నివాళులు అర్పించారు. వారి సేవలను స్మరించుకుంటూ పలువురు సభ్యులు భావోద్వేగంగా ప్రసంగించారు. అనంతరం సభ సంతాపాన్ని నమోదు చేసింది. ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), ప్రతిపక్ష నేత కేసీఆర్‌(KCR)తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సభలో ఆసక్తికర పరిణామంగా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ స్నేహపూర్వకంగా మాట్లాడారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్కతో పాటు ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ కూడా కేసీఆర్‌ను కలిసి అభివాదం చేశారు.

ఇక, సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓఆర్‌ఆర్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల విలీనంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచే ప్రతిపాదన కూడా అజెండాలో ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించడం, తెలంగాణ జీఎస్‌టీ చట్టంలో సవరణలు, ఉద్యోగుల హేతుబద్ధీకరణ వంటి అంశాలు చర్చకు రానున్నాయి. తొలి రోజు సభ వాయిదా అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో శాసనసభ, శాసనమండలి ఎన్ని రోజుల పాటు కొనసాగాలన్నదానిపై స్పష్టత ఇవ్వనున్నారు. తొలి రోజు కార్యకలాపాల తర్వాత సభను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసే అవకాశముందని సమాచారం. వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా ఈ శీతాకాల సమావేశాలు మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగవచ్చని అంచనా. అయితే అన్ని అంశాలపై విస్తృత చర్చ జరగాలన్న ఉద్దేశంతో కనీసం పది రోజుల నుంచి రెండు వారాల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీఏసీ సమావేశం అనంతరం సమావేశాల వ్యవధిపై తుది నిర్ణయం వెలువడనుంది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -