Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారిగా మంత్రివర్గ (Cabinet Meeting) సమావేశం రాజధాని హైదరాబాద్కు బయట జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జనవరి 18న రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ములుగు జిల్లా (Mulugu District)మేడారం(Medaram)లో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సచివాలయానికే పరిమితమయ్యే కేబినెట్ భేటీని సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర నేపథ్యంలో అక్కడే నిర్వహించడం విశేషంగా మారింది. జనవరి 18న సీఎం రేవంత్రెడ్డి ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో పాటు సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సభ్యులతో కలిసి మేడారం చేరుకుని సాయంత్రం 5 గంటల అనంతరం అక్కడే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మరుసటి రోజు జనవరి 19న సీఎం మేడారంలోని అమ్మవార్ల నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి, సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమై అదే రాత్రి స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరనున్నారు.
మేడారంలో జరగనున్న ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్లపై స్పష్టత తీసుకురావచ్చని సమాచారం. అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. రైతుభరోసా నిధుల విడుదల, హ్యామ్ (HAM) మోడల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పథకాలు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది.
మేడారం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆలయ పరిసరాల అభివృద్ధి పనులు గత కొంతకాలంగా వేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి సీతక్క ఈ పనులను పర్యవేక్షించగా, సీఎం రేవంత్రెడ్డి కూడా గద్దెల ఆధునికీకరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించడం ద్వారా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను చాటాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
