Rajdhani Express : అస్సాం(Assam)లోని హోజాయ్ జిల్లా(hojai district)లో శనివారం తెల్లవారుజామున తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మిజోరాం(Mizoram)లోని సైరంగ్ నుంచి న్యూఢిల్లీ(New Delhi)కి వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక ఏనుగు పిల్లను అటవీ అధికారులు సకాలంలో రక్షించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో రైలు ఇంజన్తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.
వివరాల ప్రకారం, బుధవారం తెల్లవారుజామున సుమారు 2:17 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. గువాహటికి సుమారు 126 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోజాయ్ జిల్లా పరిధిలో రైలు వేగంగా వెళ్తున్న సమయంలో పట్టాలపై అకస్మాత్తుగా ఏనుగుల గుంపు ఎదురైంది. లోకో పైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడని అధికారులు తెలిపారు.
అయినప్పటికీ, వేగం కారణంగా రైలును ఆపడం సాధ్యపడకపోయి ఘోర ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు, సహాయక బృందాలు, అటవీ శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల్లో భయాందోళన నెలకొన్నప్పటికీ, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా రైలు పట్టాలపై ఏనుగుల కళేబరాలు చెల్లాచెదురుగా పడటంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఎగువ అస్సాం ప్రాంతంతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే రైళ్లపై ప్రభావం పడింది.
ప్రమాదానికి గురైన రాజధాని ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులను అదే రైలులోని ఖాళీ బెర్తుల్లో తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. గువాహటి చేరుకున్న తర్వాత అదనపు కోచ్లు జతచేసి రైలును మళ్లీ ఢిల్లీకి పంపిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం అధికారిక ఏనుగుల కారిడార్ కాదని అటవీ అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ఈ ప్రాంతంలో అడవి జంతువుల సంచారం ఎక్కువగా ఉండటంతో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన రైల్వే భద్రత, వన్యప్రాణుల సంరక్షణపై మరోసారి చర్చకు దారితీసింది.
