Vaikunta Ekadasi 2025: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి తిథి నెలకు రెండు సార్లు వస్తుంది. అలాగే ఏకాదశి కూడా ప్రతి నెలా రెండు సార్లు దర్శనమిస్తుంది. అయితే ఇతర తిథులతో పోలిస్తే ఏకాదశికి (Ekadasi) ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విలువ ఉంది. ఈ తిథి శ్రీమహావిష్ణువు(Lord Vishnu) కు అత్యంత ప్రీతికరమైనదిగా శాస్త్రాలు చెబుతాయి. ఏకాదశి రోజున చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయనే విశ్వాసం భక్తుల్లో గాఢంగా ఉంది. ఈ 24 ఏకాదశుల్లో అత్యంత విశిష్టమైనదిగా ముక్కోటి ఏకాదశి ((Mukkoti Ekadasi) నిలుస్తుంది. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ధనుర్మాసంలో వచ్చే ఈ పవిత్ర పర్వదినం భక్తుల జీవితాల్లో విశేష స్థానం సంపాదించుకుంది.
ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును స్తుతించి ఆయన అనుగ్రహాన్ని పొందిన రోజు కావడంతో ఈ పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తాయి. సాధారణంగా ఏకాదశి పర్వదినాలను చాంద్రమానం ప్రకారం పాటిస్తారు. కానీ వైకుంఠ ఏకాదశిని మాత్రం సౌరమానం ఆధారంగా జరుపుకోవడం విశేషం. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసంగా పిలుస్తారు. ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశినే ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశిగా ఆచరిస్తారు. ఉత్తరాయణం–దక్షిణాయనాల సంధి కాలంగా భావించే ఈ సమయాన్ని దేవతలకు బ్రాహ్మీ ముహూర్తంగా పండితులు పేర్కొంటారు. అందుకే ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
వైకుంఠ ఏకాదశి రోజున దేవతలంతా వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారని నమ్మకం. అదే సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. దీనినే ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఈ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు గంటల తరబడి వేచి ఉంటారు. మోక్ష ద్వారంగా భావించే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే జన్మ సార్థకమవుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది. ధనుర్మాస భక్తి వాతావరణంలో జరుపుకునే వైకుంఠ ఏకాదశి 2025 ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయనుంది.
