BJP : బీజేపీ క్రమశిక్షణా వ్యవహారాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అంతర్గత శాంతిని భంగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, మాజీ కేంద్ర మంత్రి మరియు బీహార్కు చెందిన ప్రముఖ లోక్సభ సభ్యుడు ఆర్కే సింగ్ను (RK Singh)పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ (suspend)చేసినట్లు బీజేపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar assembly elections) బీజేపీ అనూహ్య విజయం సాధించిన వెంటనే ఈ చర్య వచ్చిందన్న నేపథ్యంలో, అది రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. కొన్ని నెలలుగా ఆర్కే సింగ్ ఎన్డీయే నాయకత్వంపై, ముఖ్యంగా నితీశ్ కుమార్ ప్రభుత్వం పని తీరు మీద తీవ్ర విమర్శలు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు.
కేంద్రంలోని ఎన్డీయే కూటమి నిర్ణయాలు, బీహార్ ప్రభుత్వ పరిపాలన, పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆయన పదేపదే విమర్శలు చేసినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ క్రమశిక్షణా కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసును జారీ చేసింది. జారీ చేసిన నోటీసులో,”మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనివల్ల పార్టీకి నష్టం వాటిల్లింది. అందుకే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలి” అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నోటీసు బయటకు రావడంతో, బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. ఆర్కే సింగ్ రాజకీయ ప్రయాణం చూస్తే, ఆయన కెరీర్కు అనేక ముఖ్యమైన మైలురాళ్లు ఉన్నాయి. భారత విదేశాంగ సేవలో దౌత్యవేత్తగా పనిచేసిన ఆయన, యూపీఎ ప్రభుత్వం సమయంలో కేంద్ర హోం సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఆతరువాత 2013 సంవత్సరంలో ఆయన బీజేపీలో చేరి, బీహార్లోని ఆరా లోక్సభ నియోజకవర్గం నుండి వరుసగా 2014 మరియు 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో ప్రధాని మోదీ కేబినెట్లో విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖలకు మంత్రిగా నియమితులయ్యారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన పరాభవం పాలయ్యారు. ఆ ఎన్నికల తరువాత ఆయన పార్టీ లైన్కు విరుద్ధంగా పలు కీలక వ్యాఖ్యలు చేయడం, బీహార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం పార్టీ నేతలకు అభ్యంతరం కలిగించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటి తరువాత బీజేపీ తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయం, పార్టీ అంతర్గత రాజకీయాలు మారుతున్న సంకేతంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
