Delhi Tour: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల్లో నెలకొన్న పెండింగ్ అంశాల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు(funds) అవసరమైన అనుమతులు సాధించడమే లక్ష్యంగా ఆయన ఈరోజు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్(Union Minister for Water Resources CR Patil)తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అనేక అంశాలపై సమగ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రానికి జీవనాధారంగా నిలిచిన పోలవరం జాతీయ ప్రాజెక్టుతో పాటు జల్ జీవన్ మిషన్, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధుల విడుదలపై సీఎం ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల వల్ల ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆమోదం పొందిన సాగునీటి ప్రాజెక్టులకు వెంటనే ఆర్థిక సహాయం అందించాలని చంద్రబాబు స్పష్టంగా కోరారు. ఆంధ్రప్రదేశ్కు నీటి భద్రత అత్యంత కీలకమని పేర్కొన్న సీఎం, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ను సమర్థవంతంగా అమలు చేయడానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి అదనంగా రూ.1,000 కోట్లను కేటాయించాలని కోరారు. అంతేకాకుండా, రాష్ట్ర వాటాగా ఇప్పటికే ఖర్చు చేసిన రూ.524.41 కోట్లకు సంబంధించిన కేంద్ర వాటాను వెంటనే విడుదల చేయాలని మంత్రి పాటిల్ను కోరారు. పీఎం కృషి సించాయి యోజన (PMKSY) కింద చెరువుల పునరుద్ధరణ, నీటి వనరుల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రస్తుత పురోగతిని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం, ఇంకా పెండింగ్లో ఉన్న అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు.
రెండో దశ పనులకు అవసరమైన నిధులపై త్వరలోనే సమగ్ర నివేదికను సమర్పిస్తామని తెలిపారు. వంశధార ట్రైబ్యునల్ తీర్పును పూర్తిగా అమలు చేసి, శ్రీకాకుళం జిల్లా కరవు ప్రాంతాలకు మేలు చేసే నేరడి బ్యారేజీ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని చంద్రబాబు అభ్యర్థించారు. అలాగే సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశంపై కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని, ఏపీ ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలను అడ్డుకోవాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కులు, రైతుల భవిష్యత్తు కోసం కేంద్రంతో నిరంతరం పోరాటం చేస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వెల్లడించారు.
