Gold Prices: అంతర్జాతీయ మార్కెట్ల(International markets)లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రతరం కావడంతో పెట్టుబడిదారులు(Investors) సేఫ్ హేవన్ ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా అమెరికా–వెనిజువెలా మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లను ఆందోళనకు గురి చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఒక్కరోజులోనే 1 శాతం కంటే ఎక్కువగా పెరిగి కొత్త రికార్డు స్థాయులను నమోదు చేశాయి. మంగళవారం జరిగిన ట్రేడింగ్లో విలువైన లోహాలపై కొనుగోళ్ల ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు 1.2 శాతం ఎగసి 10 గ్రాములకు రూ.1,38,381 వద్ద ఆల్టైమ్ హైను తాకాయి. ఉదయం 10.48 గంటల సమయంలో కూడా బంగారం ధరలు సుమారు 1.01 శాతం లాభంతో ట్రేడ్ అవుతూ బలాన్ని కొనసాగించాయి.
మరోవైపు వెండి ధరలు ఇంకా వేగంగా పెరిగాయి. ఎంసీఎక్స్లో సిల్వర్ ధరలు 1.7 శాతం ఎగసి కిలోకు రూ.2,16,596 వద్ద కొత్త రికార్డును నెలకొల్పాయి. ఇదే సమయంలో వెండి ధరలు 1.30 శాతం లాభంతో కొనసాగడం గమనార్హం. డాలర్ ఇండెక్స్ 0.20 శాతం తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఇతర కరెన్సీల్లో చౌకగా మారింది. దీనికి తోడు అమెరికా కోస్ట్ గార్డ్ వెనిజువెలా చమురు తరలిస్తున్న సూపర్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకోవడం, ఇతర నౌకలను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం వంటి ఘటనలు మార్కెట్లలో భద్రతా భయాలను పెంచాయి. అలాగే, ఒక బాంబు దాడిలో రష్యా ఆర్మీ జనరల్ హత్యకు గురవడం కూడా గ్లోబల్ స్థాయిలో ఉద్రిక్తతలను మరింత పెంచింది.
నిపుణుల విశ్లేషణ ప్రకారం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు బంగారానికి మద్దతుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం, గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దేశీయంగా బంగారం ధరలు సుమారు 76 శాతం పెరిగితే, అంతర్జాతీయంగా దాదాపు 70 శాతం పెరిగాయి. వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా కలిపి సుమారు 140 శాతం వరకు పెరగడం మార్కెట్లలో సంచలనంగా మారింది.
