IAS Officers Transfers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ (Andhra Pradesh State Govt)యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం మొత్తం 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ( IAS Officers Transfers)చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో జిల్లా స్థాయి కీలక పోస్టులతో పాటు శాఖల వారీగా ముఖ్యమైన నియామకాలు ఉండటం గమనార్హం. గుంటూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న పి.శ్రీనివాసులును ప్రభుత్వం బదిలీ చేసి మార్కాపురం జాయింట్ కలెక్టర్గా నియమించింది.
ప్రస్తుతం మార్కాపురం జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ కొత్త బాధ్యతలు అప్పగించింది. ఆరోగ్య శాఖలో సంస్కరణలు, పాలనాపరమైన నిర్ణయాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉండనుంది. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా శ్రీవాస్ నుపుర్ అజయ్కుమార్ను నియమించారు. రేషన్ పంపిణీ, సరఫరాల వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో ఈ నియామకం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా కల్పన కుమారికి బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిపాలనలో ఆమె కీలకంగా వ్యవహరించనున్నారు.
గుంటూరు మున్సిపల్ కమిషనర్గా మయూర్ అశోక్ను నియమించారు. నగర అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనకాపల్లి జేసీగా మల్లవరపు సూర్యతేజను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎస్.ఎస్. శోబికను ప్రభుత్వం నియమించింది. గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. కడప జిల్లా జాయింట్ కలెక్టర్గా నిధి మీనాను నియమించారు. ఆమె ప్రస్తుతం కడప జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న నచికేత్ విశ్వనాథ్ భార్య కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నం జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి, అన్నమయ్య జిల్లా జేసీగా శివ్ నారాయణ్ శర్మ, పల్నాడు జిల్లా జేసీగా వి.సంజనా సింహను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
