Gudivada : తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) (ఏఎన్నార్) ఎక్కువగా చదువుకోకపోయినా, విద్య విలువను అర్థం చేసుకుని వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మహానుభావుడని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున(Film actor Akkineni Nagarjuna) అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల(ANR College)లో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్మించిన రూసా (RUSA) భవనాన్ని నాగార్జున అధికారికంగా ప్రారంభించారు. వేదికపై మాట్లాడిన నాగార్జున, తన తండ్రి ఏఎన్నార్ జీవితం మొత్తం విద్య, సంస్కృతి, సమాజ సేవకు అంకితమైందన్నారు. నా తండ్రి చదువులో పెద్దగా అవకాశాలు పొందకపోయినా, చదువు అంటే ఎంత శక్తివంతమైన ఆయుధమో తెలుసుకున్నారు.
అందుకే విద్యారంగానికి తనవంతు సేవ చేయాలనే సంకల్పంతో ఈ కళాశాలను అభివృద్ధి చేశారు అని గుర్తు చేసుకున్నారు. 1959 సంవత్సరంలో ఏఎన్నార్ కళాశాల అభివృద్ధి కోసం అప్పట్లోనే రూ. లక్ష విరాళం అందించారని తెలిపారు. ఆ రోజుల్లో అది ఎంతో పెద్ద మొత్తం అని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, స్కాలర్షిప్ల కోసం తమ కుటుంబం తరఫున రూ. 2 కోట్ల విరాళాన్ని అందిస్తున్నట్లు నాగార్జున ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ విరాళం పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపయోగపడాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. మనుషులు శాశ్వతం కాదు… కానీ మనం చేసే మంచి పనులు మాత్రం శాశ్వతంగా నిలుస్తాయి. విద్యకు చేసే సేవ తరతరాలకు ఉపయోగపడుతుంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు సభికులను ఆలోచింపజేశాయి.
ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవం సందర్భంగా కళాశాల ప్రస్థానాన్ని, సాధించిన విజయాలను గుర్తు చేస్తూ పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కళాశాల పాలకవర్గ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వేడుకలు ఏఎన్నార్ విద్యాపై ఉన్న దూరదృష్టిని, సమాజం కోసం ఆయన చేసిన సేవలను మరోసారి గుర్తు చేశాయని పలువురు అభిప్రాయపడ్డారు.
