end
Tuesday, April 14, 2026
వార్తలురాష్ట్రీయంఎకరాల పరిమితి లేదు.. రైతులందరికీ ‘రైతుభరోసా’
- Advertisment -

ఎకరాల పరిమితి లేదు.. రైతులందరికీ ‘రైతుభరోసా’

- Advertisment -
- Advertisment -

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

ఎకరాల పరిమితి లేదని, అర్హులైన రైతులందరికీ రైతుభరోసా(Raitu Bharosa Scheme) అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. రైతులు సాఫీగా సాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఎకరాల పరిమితేమీ లేదని, అర్హులైన రైతులందరికీ సొమ్ము అందుతుందన్నారు.

హైదరాబాద్‌లోని రాజేందర్‌నగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సోమవారం ఆయన క్యాబినెట్ మంత్రులతో కలిసి ‘రైతు నేస్తం’(Raithu Nestham Programme) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు మాత్రమే చూపించారని మండిపడ్డారు. ప్రభుత్వం కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేని, రుణమాఫీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.

నాటి ముఖ్యమంత్రి కేసీఆర్(Former CM KCR) వరి సాగు చేస్తే ఇక ఉరేనని రైతులను బెదిరించారని మండిపడ్డారు. తాను సీఎం అయ్యే నాటికి సర్పంచుల పదవీ కాలం ముగిసిందని, సర్పంచ్‌ల బిల్లులు పెండింగ్‌లో పెట్టింది బీఆర్‌ఎస్ సర్కారేనని గుర్తుచేశారు. గత సర్కార్ తమ నెత్తిన 8.20 లక్షల కోట్ల అప్పు పెట్టిందని వాపోయారు.

చావుల పునాదులపై అధికారంలోకి రావాలనే దురాలోచనతో బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందని నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ నేతలు చట్టవిరుద్ధంగా ఫోన్‌ట్యాపింగ్ చేశారని, భార్యాభర్తలు మాట్లాడుకునే స్వేచ్ఛ లేని పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తమ ప్రభుత్వం కొలుకునేందుకు ప్రతిపక్షాలు సమయం ఇవ్వడం లేదని ఆక్షేపించారు.

సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -