ఇవాళ రేపు మనం ఎక్కడ చూసినా.. సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) గురించే వింటున్నాం.. చదువుకున్నవారు (Literates).. చదువుకోని వారు (Illiterates) అని కాకుండా, ఎవరైనా సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కుకుంటున్నారు. జేబులు, బ్యాంకు ఖాతాలు (Bank Accounts) ఖాళీ చేసుకుంటున్నారు. ఇప్పుడు సైబర్ నేరాలు నగరాలు, పట్టణ పరిధిలోనే వెలుగు చూసేవి. సాంకేతికత పెరిగే కొద్దీ..
ఇప్పుడవి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాయి. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాల కట్టడికి నడుం బిగించింది. దీనిలో భాగంగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) (Central Bureau Of Investigation) రంగంలోకి దింపింది. ‘ఆపరేషన్ చక్ర’ (Operation Chakra) పేరుతో ప్రత్యేక ఆపరేషన్ షురూ చేసింది. ఏకంగా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని 42 ప్రదేశాల్లో గురువారం దాడులు చేయించింది.
దాడుల్లో సీబీఐ 9 మంది కరుడుగట్టిన సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నది. నిందితులంతా యూపీఐ డిజిటల్ యాప్ల ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. నిందితులు అనధికారికంగా 700 బ్యాంకుల పరిధిలో 8.5 లక్షల మ్యూల్ ఖాతాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించింది.
గాలం ఇలా..
నిందితులు సోషల్మీడియాలో మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడుల పేరుతో వ్యపార ప్రకటనలు ప్రచారం చేస్తారు. ఆ గాలానికి చిక్కిన వారికి మొదట్లో పెట్టిన పెట్టుబడికి లాభాలు చూపిస్తారు. ఇక తర్వాత మోసాలు ప్రారంభిస్తారు. ఆన్లైన్ ద్వారా తాము నిర్దేశించిన ఖాతాల్లోకి భారీగా డబ్బులు మళ్లించుంటారు. ఆ తర్వాత ముఖం చాటేస్తారు. సీబీఐ దాడుల్లో మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫారాలు, కేవైసీ రికార్డులు స్వాధీనం చేసుకుంది.
అరెస్టయిన వారిలో మధ్యవర్తులు, ఏజెంట్లు, అగ్రిగేటర్లు, ఖాతాదారులు, కొందరు బ్యాంక్ కరస్పాండెంట్లు కూడా ఉన్నారు.