Financial Changes 2026: మరో రెండు రోజుల్లో 2025 సంవత్సరం ముగిసి, 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. కొత్త ఏడాది ప్రారంభంతో పాటు సామాన్యుల జీవితం, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం చూపే పలు కీలక నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. పన్నులు, బ్యాంకింగ్ సేవలు, సంక్షేమ పథకాలు, డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఈ మార్పులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవే. 2026 జనవరి 1 నుంచి పాన్–ఆధార్ లింక్ చేయని వారికి పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ అనుసంధానం పూర్తి చేయని వారి బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పన్ను రిఫండ్లు, బ్యాంకింగ్ లావాదేవీలు నిలిచిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయడం అత్యవసరం. ఇది చేయని వారికి ఫైనాన్షియల్ సేవలన్నీ పరిమితమయ్యే అవకాశం ఉంది.
అలాగే, కొత్త ఐటీఆర్ ఫారాలు కూడా 2026 నుంచి అమల్లోకి వస్తాయి. వీటిలో బ్యాంక్ ఖాతాలు, ఖర్చుల వివరాలు ముందుగానే (ప్రీ-ఫిల్) కనిపించనున్నాయి. దీని వల్ల పన్ను దాఖలు ప్రక్రియ మరింత పారదర్శకంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2026 శుభవార్త తీసుకొస్తోంది. 2025 డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం గడువు ముగియనుండటంతో, జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి రానున్నాయి. దీని వల్ల ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, భత్యాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త వేతన నిర్మాణం వల్ల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇక, బ్యాంకింగ్ రంగంలో మరో కీలక మార్పు క్రెడిట్ స్కోర్ అప్డేట్ విధానంలో వస్తోంది. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి జరిగే క్రెడిట్ స్కోర్ అప్డేట్ ఇకపై ప్రతి వారం జరుగుతుంది.
లోన్ రీపేమెంట్లో చిన్న ఆలస్యం జరిగినా వెంటనే స్కోర్పై ప్రభావం పడనుంది. పీఎం కిసాన్ పథకంలో కొత్తగా నమోదు అయ్యే రైతులకు ‘ఫార్మర్ ఐడీ’ తప్పనిసరి చేశారు. జనవరి 1 తర్వాత దరఖాస్తు చేసే వారు ఈ డిజిటల్ ఐడీ ద్వారా మాత్రమే ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం పొందగలరు. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు యూపీఐ లావాదేవీలు, సిమ్ వెరిఫికేషన్ నిబంధనలను ఆర్బీఐ మరింత కఠినతరం చేయనుంది. అలాగే కో-లెండింగ్ విధానంలోనూ కొత్త మార్గదర్శకాలు రానున్నాయి. ప్రతి నెల మొదటి తేదీన ఎల్పీజీ, విమాన ఇంధన ధరల సవరణ కూడా కొనసాగనుంది. కాగా, 2026 కొత్త సంవత్సరం ఆర్థికంగా కీలక మార్పులతో ప్రారంభమవుతోంది. ముందే అవగాహన కలిగి ఉండటం వల్ల ఇబ్బందులను తప్పించుకోవచ్చు.
