తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film industry)లో విషాదం నెలకొన్నది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి (Director Ravikumar Chowdary)బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. విభిన్న కథల నేపథ్యం తీసుకుని విలక్షణమైన సినిమాలు తీయడం ఈయన ప్రత్యేకత. ‘యజ్ఞం’ సినిమా ఆయన తీసిన చిత్రాల్లో మేటి(Yagnam Movie Blockblaster). ‘ఈతరం ఫిలింస్’ పోకూరి బాబూరావు నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకున్నది.
రాయలసీమలో కక్షలు కార్పణ్యాలు వద్దు.. అక్కడ శాంతి సామరస్యాలు పరిఢవిల్లాలనే కథాంశంతో సినిమా తీశారు. నందమూరి బాలకృష్ణతో తీసిన చిత్రం ‘వీరభద్ర’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. తర్వాత వచ్చిన ‘ఏం పిల్లడో .. ఏం పిల్లో’ చిత్రం కూడా నిరాశే మిగిల్చింది. ‘పిల్లా నువ్వులేని జీవితం’ తన కెరీర్లో బ్లాక్ బ్లాస్టర్’. తర్వాత గోపిచంద్తో తీసిన ‘సౌఖ్యం’, తాజాగా యువ కథనాయకుడు రాజుతరుణ్ తీసిన ‘తిరగ బడరా సామి’ చిత్రాలపై పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి.
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన రవికూమార్ చౌదరి గుంటూరులోని జాగర్లమూడి విద్యాసంస్థలో విద్యాభ్యాసం చేశారు. ఆయనకు చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉండేది. ఎన్నో ఆశలతో టాలీవుడ్లో అడుగుపెట్టిన రవికుమార్ చౌదరి ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. అయినప్పటికీ.. అవకాశాలు కల్పించుకుని దర్శకుడిగా ఎదిగారు.
ఎదిగే క్రమంలోనే జీవిత భాగస్వామితో మనస్పర్థలు, కుటుంబ కలహాలు.. ఏమైతేనేం.. ఆయన భార్యతో విడిగా ఉంటున్నారు. దంపతులకు ఓ కుమార్తె. ఇంకా అంతా సర్దుకుంటుంది.. మళ్లీ రవికుమార్ చౌదరి ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ ఇస్తారు..అనుకునేలోపు ఆయన్ను మృత్యువు కబళించింది.