- దుద్దెడ శంభుదేవాలయంలో మొదలైన పనులు
సిద్దిపేట (Siddipet) జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని శ్రీ స్వయం భూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో (TEMPLE) కోనేరు పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయి. గ్రామంలోని హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో ఈ పనులు కొనసాగుతున్నాయి.
ఇక్కడి స్వామివారు స్వయంభువుగా వెలిశారని, ఆలయాన్ని సుమారు 400 సంవత్సరాల కిందట కాకతీయుల కాలంలో నిర్మించారని స్థల పురాణం చెప్తున్నది. అప్పుడే నిర్మించిన కోనేరు కాలక్రమంలో పాక్షికంగా ధ్వంసమై, పూడికతో నిండింది. మెట్లు కూలిపోయి, చెట్లు, పొదలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో కోనేరుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పనులు మొదలు పెట్టినట్టు స్థానికులు తెలిపారు.
దాతల సహకారం అవసరం
కోనేరులో రెండు సొరంగ మార్గాలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. ఇందులో ఒకటి నేరుగా గర్భగుడిలోకి వెళ్తుందన్నారు. మరొకటి ప్రఖ్యాత ఆలయాలైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి గానీ, కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయానికిగానీ దారి తీస్తుందని ప్రచారంలో ఉన్నది. ఇంతటి విశిష్టమైన కోనేరు పునరద్ధరణకు గ్రామస్థులు సహకరించాలని, దాతలు ఆర్థికంగా సహకరించాలని సేవా సమితి సభ్యులు కోరారు.
