end
=
Thursday, June 19, 2025
వార్తలుజాతీయంమావోయిస్టు పార్టీ అగ్రనేత గాజర్ల రవి ఎన్​కౌంటర్​
- Advertisment -

మావోయిస్టు పార్టీ అగ్రనేత గాజర్ల రవి ఎన్​కౌంటర్​

- Advertisment -
- Advertisment -

ఏపీలోని మారేడుమిల్లిలో ఎదురుకాల్పులు
మహిళా నాయకురాలు అరుణ, మరో మావోయిస్టు మృతి
మూడో మృతదేహాన్ని గుర్తించే పనిలో పోలీస్​వర్గాలు

ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీప్రాంతం(Maredu milli Forest)లో బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పు(Encounter)ల్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్​ కమిటీ సభ్యుడు(Maoist Party Central committee member), ఏవోబీ స్పెషల్​ జోన్​ కమిటీ సెక్రటరీ గాజర్ల రవి (Gajarla Ravi) అలియాస్​ ఉదయ్​ అలియాస్​ బిరుసు, పార్టీ మహిళా నాయకురాలు రవి వెంకట చైతన్య అలియాస్​ అరుణ(Maoist Aruna)తో పాటు మరో మావోయిస్టు మృతిచెందారు.

మూడో మావోయిస్టు వివరాలు తెలియరాలేదు. మారేడుమిల్లి అటవీప్రాంతం కింటుకూరులో మావోయిస్టు పార్టీ అగ్రనేతల సంచారం ఉన్నదని సమాచారం అందుకున్న ఏపీ పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఆ ప్రాంతానికి భారీగా భద్రతా దళాలను మోహరింపజేశారు. జవాన్లు కూంబింగ్​ చేపడుతుండగా, ఈ క్రమంలో వారికి 16 మంది మావోయిస్టుల బృందం తారసపడి కాల్పులు ప్రారంభించారు.

అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ఇరువర్గాల మధ్య సుమారు 20 నిమిషాల పాటు భీకరపోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీప్రాంతానికి పరారయ్యారు. అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మృతులను మావోయిస్టు పార్టీ అగ్రనేత గాజర్ల రవి, పార్టీ నాయకురాలు అరుణగా గుర్తించారు.

మరో మృతదేహాన్ని గుర్తుపట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో ఒక ఏకే 47 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

ఎవరీ గాజర్ల రవి..?
గాజర్ల రవికి 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అలిపిరి వద్ద జరిగిన బాంబ్​ బ్లాస్ట్​తో సంబంధం ఉందని, అదే కాక రవికి పలు విధ్వంసకర ఘటనలతో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డి మావోయిస్టులతో నిర్వహించిన శాంతిచర్చలకు రవి ప్రాతినిధ్యం వహించాడు. మావోయిస్టు పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాడు.

ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని వెలిసాల గ్రామం ఆయన స్వగ్రామం. చదువుకునే రోజుల్లోనే ఆయన వామపక్ష ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఈ క్రమంలో రాడికల్​ స్టూడెంట్​ యూనియన్​లో చేరి కీలక నేతగా ఎదిగాడు. కొండపల్లి సీతారామయ్య పిలుపును అందుకుని నాటి పీపుల్సవార్​లో చేరాడు. ఉత్తర తెలంగాణ స్పెషల్​ జోన్​ కమిటీ సభ్యుడిగా సేవలందించాడు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు.

చనిపోయే నాటికి ఆయన వయసు 62 ఏళ్లు. రవి సోదరుడు ఆజాద్​, అతని భార్య రూప కూడా గతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో మృతిచెందారు. మరో సోదరుడు అయితూ కూడా ఎన్​కౌంటర్​లోనే మృతచెందాడు. రవి భార్య జమీలా కూడా ఎదురుకాల్పుల్లోనే కన్నుమూసింది.

అరుణ ఎవరంటే..
అరుణ స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. రెండున్నర దశాబ్దాల క్రితం ఆమె మావోయిస్టు పార్టీ ఉద్యమంలోకి వచ్చింది. కొద్దిరోజులుగా అరుణ అనారోగ్యంతో సతమతమవుతున్నట్లు ఆమె సోదరుడు, మావోయిస్టు పార్టీ గాలికొండ ఏరియా కమాండర్​ ఆజాద్​ కూడా 2015లో కొయ్యూరులో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -