Australia Tour: ఆంధ్రప్రదేశ్ ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఆయన గోల్డ్ కోస్ట్(Gold Coast) లోని ప్రఖ్యాత గ్రిఫిత్ యూనివర్సిటీ(Griffith University)ని సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్) మార్నీ వాట్సన్తో మంత్రి లోకేశ్ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో, పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ (స్థిరత), ఇన్నోవేషన్ (నవీనత) వంటి కీలక రంగాల్లో రెండు సంస్థల మధ్య సంయుక్త కార్యక్రమాలు చేపట్టాలన్న విషయంపై లోకేశ్ ముందడుగు వేశారు. గ్రిఫిత్ యూనివర్సిటీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అనుసంధానం ఏర్పాటై, విద్య, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో సహకారం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
లోకేశ్ గ్రిఫిత్ యూనివర్శిటీలోని ఆధునిక క్రీడా కళాశాలను సందర్శించి, అక్కడి అగ్రశ్రేణి క్రీడా సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడిన మంత్రి, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల అభ్యాసం, పరిశోధనకు అనువుగా ఉండేలా ఒక అంతర్జాతీయ ప్రమాణాల ‘అధ్యయన హబ్’ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అలాగే, syllabus రూపకల్పన, నైపుణ్య ధ్రువీకరణ (skill validation)లో ఏపీ వర్సిటీలతో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని కోరారు. గ్రిఫిత్ యూనివర్సిటీతో డ్యూయల్ డిగ్రీలు, ట్విన్నింగ్ ప్రోగ్రామ్లు అభివృద్ధి చేయాలని సూచించారు. స్కాలర్షిప్లు, అధ్యాపకులు, విద్యార్థుల అభివృద్ధికి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
పునరుత్పాదక శక్తి, ప్రజారోగ్యం, నీటి నిర్వహణ వంటి రంగాల్లో సంయుక్తంగా పరిశోధన ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని లోకేశ్ సూచించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ‘‘పార్టనర్షిప్ సమ్మిట్’’కు గ్రిఫిత్ ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు, ఆంధ్రప్రదేశ్లోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి గ్రిఫిత్ యూనివర్సిటీ పని చేయాలని నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
