Delhi blast incident : ఫరీదాబాద్లో ఇటీవల బహిర్గతమైన ఉగ్ర కుట్ర కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ షాహిన్(Dr. Shahin) విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా భారీ ఉగ్ర దాడులు (Major terrorist attacks)జరపాలని దాదాపు రెండేళ్లుగా సన్నాహాలు సాగించినట్లు ఆమె విచారణలో అంగీకరించింది. పాకిస్థాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం ఈ కుట్రను అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు షాహిన్ వెల్లడించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలతో ఆమెను ఇటీవల అరెస్టు చేసిన అధికారులు, విచారణ నిమిత్తం శ్రీనగర్కు తరలించారు. అక్కడ జరిగిన ప్రశ్నోత్తరాల్లో షాహిన్ అనేక షాకింగ్ విషయాలు వెల్లడించిందని సమాచారం. ఉమర్ అనే వ్యక్తి ప్రతిసారీ దేశంలో బహుళ దాడులు చేయాల్సిన అవసరాన్ని ఉత్సాహంగా ప్రోత్సహించేవాడని ఆమె తెలిపింది. అదేవిధంగా, డాక్టర్ ముజమ్మిల్, ఆదిల్లతో కలిసి రెండు సంవత్సరాలుగా అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరించినట్లు అంగీకరించింది. వీటిని ఉపయోగించి దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులు జరపాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు కూడా వెల్లడించింది.
విచారణలో మరో ముఖ్యమైన అంశం బయటపడింది. షాహిన్ సోదరుడు పర్వేజ్ సయీద్ కూడా ఈ మాడ్యూల్లో భాగమని ఆమె చెప్పింది. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు అతడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడి వద్ద నుండి ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, అరెస్టు అవుతాననే భయంతో అతడు వాటిని దాచి ఉంచి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, గురుగ్రామ్కు చెందిన అమ్మోనియం నైట్రేట్ సరఫరాదారుడిని కూడా అధికారులు గుర్తించినట్లు సమాచారం. త్వరలోనే అతడిపై సోదాలు నిర్వహించి అరెస్టు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ షాహిన్ అరెస్టు వెనుక జైషే మహమ్మద్ నెట్వర్క్ దాగి ఉందని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. జమాత్ ఉల్ మొమినాత్ అనే మహిళా విభాగానికి జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నాయకత్వం వహిస్తుండగా, ఈ విభాగంలో షాహిన్ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత్లో మహిళా విభాగాలను స్థాపించడం, నియామకాలు చేపట్టడం, నిధులు సేకరించడం వంటి పనులను ఆమె పర్యవేక్షించిందని విచారణలో తెలిసింది. ఇక, మరో వైపు, ఇటీవల దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాంబు తీవ్రతను బట్టి మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు ఉపయోగించబడినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దీని వెనుక కూడా అదే ఉగ్ర మాడ్యూల్ చేతులు ఉన్నాయేమో అనే దిశగా విచారణ కొనసాగుతోంది. భద్రతా సంస్థలు రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు, వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని వెల్లడించాయి.
