Hyderabad : తెలంగాణ అభివృద్ధి వేగవంతం కావాలంటే రాష్ట్రం ప్రతిపాదించిన కీలక ప్రాజెక్టులకు కేంద్రం ( center)తక్షణ ఆమోదం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy)కోరారు. కేంద్రం సహకారం లభిస్తే హైదరాబాద్ మరింత వేగంగా ఎదిగి, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే నగరంగా అవతరించగలదని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశం హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో నిర్వహించగా, ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి ప్రాధాన్యంతో పాటు మరో ఆధునిక నగర నిర్మాణాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ‘తెలంగాణ రైజింగ్–2047’ పేరుతో దీర్ఘకాలిక దృష్టి పధకం రూపొందించి, బలమైన పట్టణ మౌలిక వసతులు, ఆర్థిక క్లస్టర్లు, ప్రపంచ స్థాయి జీవన ప్రమాణాలు కలిగిన రాష్ట్ర నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
భారత్ను ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో తెలంగాణ కూడా కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందన్నారు. దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రయాణిస్తుంటే అందులో తెలంగాణ జీడీపీ వాటా కనీసం 10 శాతం ఉండేలా కృషి చేస్తున్నామని చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధిని నడిపిస్తున్న ఐదు మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటని, ఈ నగర పురోగతికి కేంద్రం సహకారం కీలకమని రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్, మూసీ నది పునరుజ్జీవం వంటి పెద్ద ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అత్యవసరమని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని, ఆయన సానుకూల సహకారం లభిస్తే తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల పురోగతి మరింత వేగవంతమవుతుందని చెప్పారు.
మోదీ గుజరాత్లో సబర్మతి రివర్ఫ్రంట్ వంటి మోడల్ ప్రాజెక్టులను అమలు చేసినట్లే, తెలంగాణలో కూడా మూసీ రివర్ఫ్రంట్ను ఆధునిక రూపంలో తీర్చిదిద్దుతున్నామని రేవంత్రెడ్డి తెలిపారు. గుజరాత్కు లభించిన సహాయక వాతావరణం తెలంగాణకూ అందించాలని కేంద్రాన్ని కోరారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలపై చర్చలు జరిపి, మిగతా సమయాల్లో అభివృద్ధి పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర హౌసింగ్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్, ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ మోహన్లాల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
