Maoists: ఏపీ ఏజెన్సీ పరిమితిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతం (Maredumilli forest area)మళ్లీ ఉద్రిక్తంగా మారింది. బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలు (Security forces) నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ (Combing operation)సమయంలో మావోయిస్టులతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని, వీరంతా ఛత్తీస్గఢ్కు చెందినవారిగా ప్రారంభ సమాచారం అందిందని అధికారులు పేర్కొన్నారు. మరణించిన వారిలో కీలక అగ్రనేత దేవ్జీ కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు ఇంకా కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. సంఘటన స్థలంలో కనుగొన్న మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఎదురుకాల్పుల విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్చంద్ర లడ్డా స్వయంగా ధ్రువీకరించారు. మృతుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మావోయిస్టు జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఉన్నాడని ఆయన వెల్లడించారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని డీజీ తెలిపారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఇటీవల మావోయిస్టుల కదలికలు పెరిగిన నేపథ్యంలో ఏపీ పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని లడ్డా చెప్పారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్కు ప్రవేశించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. నవంబరు 17న ప్రత్యేక ఆపరేషన్ను ప్రారంభించగా, తదుపరి రోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా మద్వితో పాటు ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారని తెలిపారు.
ఇప్పటికే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో నిర్వహించిన దాడుల్లో మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ముగ్గురు, ప్లాటూన్ సభ్యులు 23 మంది, డివిజనల్ కమిటీ సభ్యులు ఐదుగురు, ఏరియా కమిటీ సభ్యులు 19 మంది ఉన్నారని వివరించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఈ చర్యలు తీసుకున్నామని ఆయన హామీ ఇచ్చారు. అరెస్టుల సమయంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు ల్లోకి పారిపోయారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు మొహరించాయని చెప్పారు. హిడ్మా లేఖ రాశాడన్న ప్రచారం అసత్యమని, ఆయన ఎదురుకాల్పుల్లోనే మరణించినట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా మావోయిస్టు ప్రభావంలేని రాష్ట్రంగా మార్చడానికి పోలీసులు కృషి చేస్తున్నారని, త్వరలో మరికొందరు లొంగిపోవచ్చని లడ్డా అభిప్రాయపడ్డారు.
