end
=
Thursday, March 12, 2026
వార్తలుఅంతర్జాతీయంభారత్ మా అమ్మ ప్రాణాలను కాపాడింది: షేక్ హసీనా కుమారుడు
- Advertisment -

భారత్ మా అమ్మ ప్రాణాలను కాపాడింది: షేక్ హసీనా కుమారుడు

- Advertisment -
- Advertisment -

Bangladesh : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కుమారుడు సాజీబ్ వాజెద్ జోయ్ (Sajeeb Wazed Joy)సంచలనాత్మక వ్యాఖ్యలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. భారత్‌లో ఉన్న తన తల్లి ప్రాణాలకు బంగ్లాదేశ్‌లోని మిలిటెంట్ల నుంచే అత్యంత తీవ్రమైన ప్రమాదం ఉందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యలో, ఆమెకు భారత ప్రభుత్వం అందిస్తున్న రక్షణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదం మళ్లీ తలెత్తుతోందని, ఈ పరిస్థితుల్లో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం హసీనా అప్పగింత కోసం చేస్తున్న ఒత్తిడిని ఆయన తీవ్రంగా నిరసించారు.

ప్రస్తుత ప్రభుత్వం న్యాయ ప్రక్రియను పూర్తిగా వక్రీకరిస్తోందని ఆరోపిస్తూ, హసీనా పై పెట్టిన కేసులు పూర్తిగా కల్పితమని వ్యాఖ్యానించారు. విచారణ కోసం పార్లమెంట్ అనుమతి లేకుండానే కొన్ని చట్టాలను మార్చడం, 17మంది న్యాయమూర్తులను అకస్మాత్తుగా తొలగించడం వంటి చర్యలు న్యాయ వ్యవస్థపై దాడులేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, రక్షణ న్యాయవాదులను కూడా కోర్టులో ప్రవేశించనివ్వకపోవడం భయంకరమైన పరిణామమని అన్నారు. “భారత్ మా తల్లికి జీవదాతలా నిలిచింది. ఆమె బంగ్లాదేశ్‌లోనే ఉండి ఉంటే, తీవ్రవాద గ్రూపులు ఇప్పటికే ఆమెను చంపేశేవి” అని జోయ్ భావోద్వేగంగా చెప్పారు. యూనుస్ నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే, హసీనా పాలనలో అరెస్టయిన అనేకమంది ఉగ్రవాదులను విడుదల చేసినట్లు ఆయన ఆరోపించారు.

దీంతో లష్కరే తోయిబా వంటి ప్రమాదకర సంస్థలు బంగ్లాదేశ్‌లో తిరిగి చురుకుగా కార్యకలాపాలు చేపట్టే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం పునరుద్ధరణపై భారత ప్రధాని మోదీ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఈ పరిణామాలు ప్రాంత స్థిరత్వానికి పెద్ద ముప్పు కావచ్చని జోయ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, బంగ్లాదేశ్ చేసిన అప్పగింత అభ్యర్థనను భారత్ తిరస్కరిస్తుందనే పూర్తి నమ్మకం తనకుందని ఆయన స్పష్టం చేశారు. జోయ్ చేసిన ఈ ఆరోపణలు, వ్యాఖ్యలు బంగ్లాదేశ్–భారత్ సంబంధాలపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -