YS Jagan : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల(Government Medical Colleges) ను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ(YCP) తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. తమ హయాంలో మంజూరైన మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతులకు అప్పగించే ప్రయత్నాన్ని తాము సహించబోమని పార్టీ స్పష్టం చేస్తోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన కోటికి పైగా సంతకాలను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గవర్నర్కు అందజేయనున్నారు. ఈ మేరకు నేటి సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో గవర్నర్తో జగన్ భేటీ కానున్నారు. అంతకుముందు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సంతకాల ప్రతులతో కూడిన వాహనాలను ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమై, పీపీపీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై సమాలోచనలు జరుపనున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ‘జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ’ లక్ష్యంగా అనేక కాలేజీలకు అనుమతులు ఇచ్చామని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య విద్య, మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతోనే ఆ నిర్ణయాలు తీసుకున్నామని చెబుతున్నారు. అయితే ఇప్పుడు నిధుల కొరత, సమర్థ నిర్వహణ అనే కారణాలను చూపుతూ కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ విధానంలోకి నెట్టడం వెనుక ప్రైవేటు ప్రయోజనాలే ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. పీపీపీ విధానం అమలైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల స్వభావమే మారిపోతుందని, ఫీజులు పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో చికిత్స పొందే అవకాశాలు కూడా తగ్గిపోతాయని హెచ్చరిస్తోంది.
ఈ ఉద్యమానికి అక్టోబర్ 9న నాంది పలికారు వైఎస్ జగన్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన అక్కడి నుంచే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా శంఖారావం పూరించారు. అప్పటి నుంచి గ్రామస్థాయిలో రచ్చబండలు, మండల కేంద్రాల్లో నిరసనలు, యువతతో బైక్ ర్యాలీలు, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ వంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. అదే సమయంలో కోటి సంతకాల సేకరణను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్కు నేరుగా తెలియజేయడమే లక్ష్యంగా ఈ రోజు జగన్ రాజ్భవన్కు వెళ్లనున్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
