Pakistan : పాకిస్థాన్ రాజకీయాల్లో మరో సంచలన తీర్పు వెలువడింది. తోషఖానా అవినీతి కేసు (Toshakhana corruption case)లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)కు 17 ఏళ్ల జైలు శిక్ష(17 years in prison) విధిస్తూ పాకిస్థాన్ కోర్టు(Pakistan Court) శనివారం కీలక తీర్పునిచ్చింది. ఇదే కేసులో ఆయన భార్య బుష్రా బీబీకీ (Bushra Bibiki)సమాన శిక్ష విధించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పటికే పలు కేసుల్లో జైల్లో ఉన్న ఇమ్రాన్కు ఈ తీర్పు మరింత ఎదురుదెబ్బగా మారింది. ఈ కేసు నేపథ్యానికి వెళ్తే… 2021లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని హోదాలో భార్యతో కలిసి సౌదీ అరేబియాకు అధికారిక పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో సౌదీ యువరాజు ఆయనకు ఖరీదైన బుల్గారి ఆభరణాల సెట్ను బహుమతిగా అందజేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ నేతల నుంచి వచ్చిన బహుమతులను తోషఖానాకు అప్పగించాల్సి ఉండగా, ఇమ్రాన్ ఖాన్ ఆ ఆభరణాలను ప్రభుత్వ ఖజానాకు సమర్పించలేదని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఆ సెట్ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం విక్రయించారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలపై నమోదైన కేసును కోర్టు ఇటీవల విచారించింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అదే జైలులో ప్రత్యేక ఏర్పాట్లతో విచారణ చేపట్టిన న్యాయస్థానం, సాక్ష్యాలు మరియు వాదనలను పరిశీలించిన అనంతరం ఇమ్రాన్ దంపతులు దోషులని తేల్చింది. ఈ కేసులో జడ్జి అర్జుమంద్ తీర్పు వెల్లడిస్తూ ఇద్దరికీ 17 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరిపై 1.64 కోట్ల పాకిస్థానీ రుపాయల జరిమానా కూడా విధించారు. తీర్పు ప్రకటించే సమయంలో ఇమ్రాన్ ఖాన్ వయసు, బుష్రా బీబీ మహిళ అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయినప్పటికీ, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ఈ తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, న్యాయపరంగా ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. రాజకీయ కక్షతోనే ఈ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. మరోవైపు, పాక్ రాజకీయాల్లో ఈ తీర్పు కొత్త పరిణామాలకు దారి తీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
