Vaikuntha Ekadashi : హిందూ ధర్మ సంప్రదాయంలో(Hindu Dharma tradition) ఏకాదశి వ్రతానికి (Ekadashi Vratham) విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు ఉన్నప్పటికీ, వాటిలో అత్యంత పవిత్రమైనదిగా ముక్కోటి ఏకాదశి గుర్తింపు పొందింది. మార్గశిర మాస శుక్ల పక్ష ఏకాదశి నాడు వచ్చే ఈ తిథిని భక్తులు కేవలం వ్రతదినంగా మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని కలిగించే మహా పర్వంగా భావిస్తారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, మోక్ష మార్గం భక్తులకు సులభమవుతుందని శాస్త్రోక్త నమ్మకం. ‘ముక్కోటి’ అనే పదానికి మూడు కోట్లు అనే అర్థం ఉంది. పురాణ కథనాల ప్రకారం, ఈ పవిత్ర దినాన మూడు కోట్ల దేవతలు వైకుంఠానికి చేరుకుని శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారని విశ్వాసం.
దేవతలంతా ఒకే రోజున నారాయణుడిని సేవించుకునే అరుదైన సందర్భం కావడంతో ఈ ఏకాదశికి ప్రత్యేక పేరు వచ్చింది. భక్తుల పట్ల కరుణ చూపే విష్ణుమూర్తి ఈ రోజున వైకుంఠ ద్వారాలను విప్పి, భూలోక భక్తుల ప్రార్థనలను విశేషంగా స్వీకరిస్తాడని భావిస్తారు. అందుకే దేశవ్యాప్తంగా అనేక విష్ణు ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనానికి అపారమైన ప్రాముఖ్యత ఏర్పడింది. ముక్కోటి ఏకాదశి నాడు ఆచరించే ఉపవాసానికి అసాధారణమైన పుణ్యఫలం ఉంటుందని ధర్మగ్రంథాలు వివరిస్తాయి. సాధారణంగా ప్రతి ఏకాదశి వ్రతం ప్రత్యేక ఫలితాన్ని ఇస్తే, ఈ రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేస్తే మిగిలిన 23 ఏకాదశుల వ్రతాల ఫలితమంతా సమకూరుతుందని నమ్మకం.
ఈ కారణంగా అనేక మంది భక్తులు నిరాహార దీక్షలు, ఫలాహార వ్రతాలు చేపట్టి, కఠిన నియమాలతో రోజంతా గడుపుతారు. విష్ణు సహస్రనామ పఠనం, భజనలు, పూజలు, దానధర్మాలు చేయడం ద్వారా మనస్సు శుద్ధి చెంది, పాపక్షయం జరుగుతుందని విశ్వాసం. ఈ పవిత్ర దినాన్ని సామాన్య భక్తులే కాదు, మునులు, యోగులు కూడా అత్యంత గౌరవంతో పాటిస్తారు. ఈ రోజున చేసిన జపం, ధ్యానం, సేవలు నేరుగా ఆధ్యాత్మిక పురోగతికి దోహదం చేస్తాయని భావిస్తారు. తిరుపతి, శ్రీరంగం, కంచి వంటి ప్రముఖ విష్ణు క్షేత్రాల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. భౌతిక ఆశల నుంచి విముక్తి పొంది, ఆత్మశాంతిని పొందాలనే ఆకాంక్షతో ముక్కోటి ఏకాదశిని భక్తులు ఘనంగా జరుపుకుంటారు. అందుకే ఈ పర్వదినం హిందూ ధర్మంలో శాశ్వతమైన ఆధ్యాత్మిక విలువను కలిగి ఉంది.
ఏకాదశి వ్రతం చేయాలనుకునే వారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి కొన్ని నియమాలు అనుసరించాలి. ఉపవాసం ఉండాలని భావిస్తే.. ముందు రోజు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి ముందు రాత్రి నేలపై నిద్రించండి. ఏకాదశి రాత్రి, జాగారం చేస్తూ భగవంతుని ధ్యానం, భజన చేయాలి. మీ మనస్సులో చెడు ఆలోచనలు తీసుకురావద్దు. ఎవరినీ దూషించవద్దు , అమాయకులను వేధించవద్దు. ద్వాదశి రోజున, బ్రాహ్మణునికి భోజనం పెట్టిన అనంతరం ఉపవాసం విరమించండి.
