Assembly : నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి వేగంగా సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అసెంబ్లీలో మూసీ పునరుద్ధరణ (Musi Restoration) అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, మూసీ నది ప్రాధాన్యతను, దాని చుట్టూ నెలకొన్న సమస్యలను, భవిష్యత్తు కార్యాచరణను విపులంగా వివరించారు. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు దాదాపు 240 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తోందని తెలిపారు. మూసీ, ఈసా నదులు కలిసే ప్రాంతమైన బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టును(Gandhi Sarovar Project) ప్రారంభించామని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన కోసం గత రెండేళ్లుగా అనేక సమీక్షలు నిర్వహించామని సీఎం తెలిపారు. వరద ముప్పును నివారించేందుకే అప్పట్లో నిజాం పాలకులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి జలాశయాలను నిర్మించారని పేర్కొన్నారు.
వికారాబాద్ అడవుల్లో నిజాం కాలంలో వనమూలికల పెంపకం జరిగేదని, అయితే ప్రస్తుతం నగర శివార్లలో కొందరు అక్రమ ఫాంహౌస్లు నిర్మించి డ్రైనేజీ నీటిని గండిపేటలోకి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు నీటిని మళ్లించి మూసీలో కలపడం వల్ల నది పరివాహక ప్రాంతం నివాసయోగ్యం కాకుండా మారిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ ఫాంహౌస్లపై కఠిన చర్యలు తీసుకున్నామని, అయినప్పటికీ కొందరు కావాలనే సోషల్ మీడియాలో భారీగా డబ్బు ఖర్చు చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కోసం 60 వేల కుటుంబాలను తరలించారని, యూపీలో గంగ ప్రక్షాళన కోసం వేల మందిని పునరావాసం కల్పించారని, ఢిల్లీలో యమునా శుద్ధి హామీతోనే బీజేపీ విజయం సాధించిందని ఉదాహరణలు ఇచ్చారు.
మూసీ మురుగు ప్రభావాన్ని నల్గొండ జిల్లా ప్రజలు భరిస్తున్నారని సీఎం భావోద్వేగంతో చెప్పారు. ఫ్లోరైడ్ సమస్యతో అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, మూసీ నీరు అక్కడి ప్రజలకు గుడిబండలా మారిందన్నారు. ఆ నీటిని తాగితే పిల్లలు పుట్టని పరిస్థితి, పంటలు పండని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా తొలి దశలో 21 కిలోమీటర్ల మేర పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి చేస్తామని, మార్చిలో ఫస్ట్ ఫేజ్ పనులు మొదలవుతాయని తెలిపారు. సంక్రాంతి నాటికి డీపీఆర్పై స్పష్టత వస్తుందని చెప్పారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 51 కిలోమీటర్ల మేర మూసీ అభివృద్ధితో పాటు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని వెల్లడించారు. మీరాలం ట్యాంక్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమేనని, అక్కడ రూ.450 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తున్నామని సభ దృష్టికి తీసుకువచ్చారు.
