Tamil Nadu : తిరుప్పరకుండ్రం కొండపై కార్తిక దీపం (Thirupparankundram Lamp)వెలిగించే అంశంలో తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి (DMK government)మద్రాసు హైకోర్టులో (Madras HC)ఊరట లభించలేదు. మదురై సమీపంలోని ఈ చారిత్రక కొండపై ఉన్న దీపస్తంభంలో దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, దర్గా ప్రతినిధులు దాఖలు చేసిన అప్పీలు కొట్టివేయబడ్డాయి.
ఈ కేసు విచారణ సందర్భంగా, ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం దీపస్తంభంలో దీపం వెలిగించరాదని వ్యాజ్యదారులు చేసిన వాదనలకు సరైన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాంటి నిషేధం ఉందని నిరూపించే బలమైన పత్రాలు లేదా గ్రంథ ఆధారాలు కోర్టు ముందు ఉంచలేకపోయారని పేర్కొంది.
అంతేకాదు, ఈ దీపస్తంభం సుబ్రమణ్యస్వామి ఆలయానికి చెందినదేనని కూడా న్యాయస్థానం స్పష్టంగా వెల్లడించింది. దీపం వెలిగిస్తే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏడాదిలో కేవలం ఒక్కరోజు జరిగే కార్తిక దీపోత్సవం వల్ల పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తుతాయని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని అనవసరంగా రాజకీయ రంగు పులిమారని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. తిరుప్పరకుండ్రం కొండపై ఉచ్చి పిళ్లైయార్ ఆలయం వద్ద ఏటా కార్తిక దీపోత్సవం సందర్భంగా దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, అదే కొండపై సికందర్ దర్గా సమీపంలో, దాదాపు 15 మీటర్ల దూరంలో ఉన్న మరో దీపస్తంభంలో కూడా దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రామ రవికుమార్ అనే వ్యక్తి గతేడాది డిసెంబరులో హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ను విచారించిన మదురై బెంచ్ సింగిల్ జడ్జి, దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్కడ ఏర్పాట్లు జరగకపోవడంతో పిటిషనర్ మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, సీఐఎస్ఎఫ్ భద్రత మధ్య దీపం వెలిగించుకోవచ్చని అనుమతిచ్చారు. అదే సమయంలో దర్గా సమీపంలో దీపం వెలిగించేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగి పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో కొండ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, దర్గా ప్రతినిధులు డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా, తాజాగా ఆ అప్పీలను తోసిపుచ్చుతూ డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. దీంతో తిరుప్పరకుండ్రం కార్తిక దీపం వివాదం మరో మలుపు తిరిగింది.
