Telangana : రాష్ట్రంలో జిల్లాల (Districts) సంఖ్య మరోసారి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కీలక నిర్ణయం తీసుకుని జిల్లాల విభజన చేపట్టారు. పాలన ప్రజలకు మరింత దగ్గర కావాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు అప్పట్లో ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం పూర్తిగా శాస్త్రీయంగా లేదని రాజకీయ అవసరాల కోసమే జిల్లాల విభజన జరిగిందని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) తీవ్రంగా విమర్శిస్తున్నారు. జిల్లాల ఏర్పాటులో భౌగోళిక పరిస్థితులు, జనాభా, వనరుల లభ్యత, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పక్కనపెట్టి కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజలకు నిజంగా ఉపయోగపడే విధంగా పరిపాలనను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలను తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చిన్నచిన్న పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రాలు దగ్గరగా ఉండటం వల్ల లాభం చేకూరిందని కేటీఆర్ వాదించారు. ఇలాంటి జిల్లాలను ముట్టుకుంటే తీవ్ర ప్రజా ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఈ అంశం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను తగ్గిస్తుందా? లేక సరిహద్దులను మాత్రమే మార్చుతుందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. కొందరు జిల్లాల విభజన వల్ల పరిపాలన మెరుగైందని భావిస్తే మరికొందరు మాత్రం అనవసర ఖర్చులు పెరిగాయని వ్యవస్థ గందరగోళంగా మారిందని అభిప్రాయపడుతున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం కేవలం పరిపాలనా నిర్ణయమే కాకుండా రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. కమిటీ నివేదిక ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.
