end
=
Friday, February 27, 2026
వార్తలురాష్ట్రీయంఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లు
- Advertisment -

ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లు

- Advertisment -
- Advertisment -

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(AP)లో పరిపాలనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం 11 జిల్లాల(11 districts)కు కొత్త జాయింట్ కలెక్టర్లను(New Joint Collectors) నియమించింది. ఈ బదిలీలు, నియామకాల జాబితాలో ఇటీవల ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలు కూడా ఉండడం విశేషం. జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న పి. శ్రీనివాసులును మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో పరిపాలనా వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేయడం ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం ఆయన ముందున్న ప్రధాన బాధ్యతగా మారనుంది.

ఇదే సమయంలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గొబ్బిళ్ల విధ్యాధరిని విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. విశాఖపట్నం వంటి కీలక జిల్లాలో ఆమె అనుభవం పరిపాలనకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న ఆదర్శ రాజేంద్రన్‌ను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సప్లయిస్ విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న ఆర్. గోవిందరావును బదిలీ చేసి తిరుపతిలోని టుడా (తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) వైస్ చైర్మన్‌గా నియమించారు. అదనంగా తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించడం ద్వారా కీలక బాధ్యతలు కట్టబెట్టారు.

ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గోపాల్ కృష్ణ రోణంకిని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. ఆరోగ్య రంగంలో పరిపాలనా అనుభవం అవసరమైన నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో ఖాళీగా ఉన్న పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వి. సంజన సింహాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న బచ్చు స్మరణ్ రాజ్‌కు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలతో జిల్లాల పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -