Free distribution schemes : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఉచిత పథకాల పంపిణీపై కాకుండా ప్రజలను వివిధ ప్రభుత్వ పథకాల(Government schemes) ద్వారా స్వయం ఆధారితులుగా తీర్చిదిద్దడంపైనే ఎక్కువ విశ్వాసం ఉంచుతారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా కేవలం ప్రభుత్వమే అన్నీ చేయాలన్న విధానం దీర్ఘకాలికంగా ఉపయోగకరం కాదని ప్రధాని అభిప్రాయం అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కూడా బాధ్యత తీసుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే మోదీ ఆలోచనా విధానమని గోయల్ పేర్కొన్నారు.
గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్లో నిర్వహించిన ‘వైబ్రంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్’లో ప్రసంగించిన పీయూష్ గోయల్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాలను ప్రధాని స్వయంగా రూపకల్పన చేశారని తెలిపారు. ఈ పథకాలు మోదీ ఆలోచనా విధానానికి ప్రత్యక్ష ఉదాహరణలని ఆయన అన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ పౌరులకు విద్యుత్ రంగంలో సాధికారత కల్పిస్తున్నారని చెప్పారు. ఈ పథకంలో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూనే వినియోగదారుడు కూడా కొంత ఖర్చు భరించాల్సి ఉండటం వల్ల వ్యక్తిగత భాగస్వామ్యం పెరుగుతుందని వివరించారు.
ప్రభుత్వం అన్నీ ఉచితంగా అందించాలన్న అంచనాలు తగ్గాలని, ప్రజలు ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడకూడదని గోయల్ హితవు పలికారు. ఒక పథకం విజయవంతంగా అమలవ్వాలంటే ప్రభుత్వ మద్దతుతో పాటు పౌరుల చురుకైన భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు. విద్యుత్ వంటి వనరులను పూర్తిగా ఉచితంగా ఇస్తే భవిష్యత్తులో కోతలు, ఆర్థిక భారాలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు వినియోగంలో జాగ్రత్త వహిస్తూ తమ వంతు బాధ్యత నిర్వర్తించినప్పుడే దేశం స్థిరమైన అభివృద్ధి సాధిస్తుందని ఆయన తెలిపారు. ఉచితాల కంటే సాధికారతే దేశాన్ని ముందుకు నడిపించే మార్గమని గోయల్ వ్యాఖ్యానించారు.
