end
=
Thursday, March 26, 2026
వార్తలురాష్ట్రీయంభూ ప‌రిపాల‌న‌లో కొత్తశ‌కం!
- Advertisment -

భూ ప‌రిపాల‌న‌లో కొత్తశ‌కం!

- Advertisment -
- Advertisment -
  • 2వ తేదీ నుంచి ఇంటిగ్రేటెడ్ భూభార‌తి
  • మొద‌ట ఐదు మండ‌లాల్లో అమ‌లు
  • సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఒకేచోట
  • ఒక్క క్లిక్‌తో స‌మ‌స్త భూ స‌మాచారం
  • ప్ర‌తి స‌ర్వేనెంబ‌ర్‌కు భూధార్ నెంబ‌ర్
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ భూప‌రిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. రైతులకు అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త‌గా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్ (ఇంటిగ్రేటెడ్ డిజిట‌ల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజిమెంట్ సిస్ట‌మ్‌) ను ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఐదు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా అమలు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

గురువారం స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ , ఎన్ఐసి అధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న మేర‌కు తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా భూప‌రిపాల‌న సేవ‌ల‌ను మ‌రింత వేగవంతంగా అందించ‌డానికి రెవెన్యూ, స్టాంప్స్‌& రిజిస్ట్రేష‌న్ , స‌ర్వే విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ భూభార‌తి పోర్ట‌ల్‌ను అభివృద్ది చేశామ‌న్నారు. ప్ర‌తి భూలావాదేవీ వివ‌రాలు క‌నిపించేలా పార‌ద‌ర్శ‌కంగా ఈ పోర్ట‌ల్‌ను రూపొందించిన‌ట్లు వెల్ల‌డించారు.

ఇంటిగ్రేటెడ్‌ భూభార‌తి పోర్ట‌ల్ ను నారాయ‌ణ‌పేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి, ఖ‌మ్మం జిల్లా కుసుమంచి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వ‌రావుపేట మండ‌లాల్లో వ‌చ్చేనెల 2వ తేదీ నుంచి ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. ఈ పైల‌ట్ మండ‌లాల్లో మెరిట్- డీమెరిట్ ల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి వాటికి అవ‌స‌ర‌మైన మార్పులు చేర్పులు చేసి రెండ‌వ ద‌శ‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమ‌లు చేస్తామ‌ని తెలిపారు.

భూభార‌తి చ‌ట్టంలో పేర్కొన్న‌విధంగా వ్య‌వ‌సాయ భూముల‌కు సంబంధించి క్ర‌య విక్ర‌యదారుల‌కు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ర్వే మ్యాపును జ‌త‌ప‌ర‌చే నిబంధ‌న‌ను ఈ ఐదు మండ‌లాల్లో అమ‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. తద్వారా రాష్ట్రంలో భూవివాదాల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్నారు. ఈ ఐదు మండ‌లాల్లో ప్ర‌తి స‌ర్వే నెంబరుకు ఆధార్ నెంబ‌ర్ మాదిరిగానే భూధార్ నెంబ‌ర్‌ను కూడా ఇస్తామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే ప్ర‌యోగాత్మ‌కంగా న‌క్షాలేని ఐదు గ్రామాల్లో రీస‌ర్వే నిర్వ‌హించి భూధార్ నెంబర్‌ను కేటాయించిన‌ట్టు తెలిపారు.

ఒక క్లిక్ తో రైతుల‌కు సంబంధించిన భూముల పూర్తి స‌మాచారం ల‌భించేలా చాలా సులువుగా, సుల‌భ‌త‌రంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను రూపొందించామ‌ని ఆధార్ నెంబ‌ర్‌తో అనుసంధాన‌మైన మొబైల్ నెంబ‌ర్ ద్వారా లాగిన్ అయిన వెంట‌నే కావల‌సిన స‌మాచారం ల‌భిస్తుంద‌న్నారు. ఈ పోర్ట‌ల్‌లో ప్ర‌ధానంగా స‌మాచారం సేవ‌లు, స‌ర్వే సేవ‌లు, క‌రెక్ష‌న్ సేవ‌లు, అప్పీల్ సేవ‌లు, రిజిస్ట్రేష‌న్ సేవ‌లతోపాటు సిటిజ‌న్ డాష్ బోర్డు సేవ‌ల‌కు సంబంధించి మైల్యాండ్ పోర్ట్‌ఫోలియో, నాలా ఆర్డ‌ర్స్‌, రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్ వివ‌రాలు, ఫీడ్‌బ్యాక్‌, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్వోఆర్‌, భూధార్ నెంబ‌ర్‌, ద‌ర‌ఖాస్తు వివ‌రాలు, మ్యూటేష‌న్, ఈసీ, మార్కెట్ విలువ‌, విలేజ్ మ్యాప్‌, ప్ర‌తి స‌ర్వేనెంబ‌ర్‌కు మ్యాప్‌, ఆర్వోఆర్‌, గ్రామాల న‌క్షా, పాస్ బుక్ క‌రెక్ష‌న్‌, వంటి పూర్తి స‌మాచారం, సేవ‌లు ల‌భించేలా మూడు విభాగాల‌ను అనుసంధానం చేస్తూ భూభార‌తి పోర్ట‌ల్ ను పూర్తి స్దాయిలో ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. రిజిస్ట్రేష‌న్‌, ఇత‌ర భూసేవ‌ల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్ప‌టి నుంచి ఆ ప్ర‌క్రియ పూర్త‌య్యేవ‌ర‌కు ప్ర‌తి స్టేజ్ లో దాని వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఎస్.ఎమ్‌.ఎస్ ద్వారా ఖాతాదారునికి స‌మాచారం కూడా అందుతుంద‌న్నారు. స‌మావేశంలో రెవెన్యూ కార్య‌ద‌ర్శి డీఎస్ లోకేష్ కుమార్‌, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ ఐజీ రాజీవ్ గాంధీ హ‌నుమంతు, ఎన్ఐసి అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -