- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ట్రెసా అసోసియేషన్
- వినతిపత్రం అందజేసిన ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి
తెలుగు 24, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA) కోరింది. రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ అధ్యక్షుడు రమన్రెడ్డి తదితరుల బృందం సోమవారం సీఎంను (CM)కలిసి చర్చించింది. తమ వినతులకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, వీలయినంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని వంగా రవీందర్ రెడ్డి తెలిపారు.
ప్రధాన సమస్యలు ఇవే..
ప్రస్తుతం రెవెన్యూ (REVENUE) ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సీఎంకు వినతిపత్రం రూపంలో అందజేశారు.
1. గత 13 సంవత్సరాలుగా తహసీల్దార్లుగా పనిచేస్తున్న దాదాపు 100 మందికి వెంటనే డిప్యూటీ కలెక్టర్ లుగా పదోన్నతులు కల్పించడం, తద్వారా కిందిస్థాయి వరకు సిబ్బందికి ప్రమోషన్ కు అవకాశాలు కల్పించడం.
2. గత ఎన్నికలలో బదిలీపై వెళ్లి, స్వంత జిల్లాలకు తిరుగు బదిలీలు కల్పించని తహసీల్దార్ లను స్వంత జిల్లాలకు బదిలీ చేయడం.
3. అనేక సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఆపరేటర్లను కొనసాగించడం.
4. రెగ్యులరైజ్ చేయబడిన వి.ఆర్.ఎల (VRA) విషయంలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల కింద 61 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు కల్పించడం.
తదితర వినతులను సీఎంకు వివరించినట్టు వంగా రవీందర్ రెడ్డి తెలిపారు. వీటిని సీఎం సావధానంగా విన్నారని, వీలయినంత త్వరగా ఈ విషయాల మీద చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు. పై అంశాలతో పాటు రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల విషయంలోనూ పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తామని ట్రెసా రాష్ట్ర కమిటీ ప్రకటించింది.
