ఆదాయానికి మించిన ఆస్తుల కేసు (Assets beyond income)లో అరెస్టైన నీటిపారుదల శాఖ (Irrigation Department)మాజీ ఈఎన్సీ (Ex Engineer In Chief) మురళీధర్రావు (Muraldhar Rao)కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) (Anti Correction Bureau) కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిధులను తన కుమారుడి కంపెనీలకు మళ్లించి,
బినామీల ద్వారా సబ్ కాంట్రాక్టుల పేరుతో భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిర్ధారించింది. మంగళవారం అరెస్టు చేసిన ఏసీబీ బుధవారం మురళీధర్రావును న్యాయస్థానం ఎదుట హాజరుపరిచింది. నిబంధనలకు విరుద్ధంగా వర్క్ ఆర్డర్లు జారీ చేసి బినామీలకు కాంట్రాక్టులు కట్టబెట్టినట్లు ఏసీబీ పేర్కొంది. మురళీధర్రావు బ్యాంకు లాకర్లను ఇంకా తెరవలేదనీ, వాటి వలన మరిన్ని అక్రమాస్తులు వెలుగులోకి రావచ్చని ఏసీబీ అనుమానిస్తున్నది.
గతంలోనూ ఆదాయానికి మించిన అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో మాజీ ఈఎన్సీ హరిరామ్, మాజీ ఈఈ నూనె శ్రీధర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వీరు కూడా గతంలో కాళేశ్వరం పరిధిలోనే పర్యవేక్షణ అధికారులుగా విధులు నిర్వర్తించారు. వీరిపైనా ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో పనిచేసిన ఒక్కొక్కరుగా ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఇక తర్వాత.. ఎవరు అనే భయం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో పనిచేసిన ఇంజినీర్లలో మొదలైంది.